ఆలుమగల గొడవకు మూడు ప్రాణాలు బలి
కాశీబుగ్గ, పలాస, కోటబొమ్మాళి, : శ్రీకాకుళం జిల్లా పలాస రైలు నిలయం సమీపంలో ఘోరం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల వెంకటరావుతో సంతబొమ్మాళి మండలం కొత్తపేటకు చెందిన పూజ(28)కు 2019లో వివాహమైంది. వీరికి కుమారుడు కుశాంత్(7), కుమార్తె దీక్షిత(6) ఉన్నారు. ఉపాధిరీత్యా వెంకటరావు భార్యాపిల్లలతో కలిసి విజయవాడలో నివాసముంటున్నారు. ఇటీవల ఆయన సోదరి భర్త మృతి చెందడంతో పరామర్శకు స్వగ్రామానికి వచ్చారు.
వెంకటరావు తల్లి పాపమ్మ వృద్ధురాలు కావడంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు సపర్యలు చేసే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలతో కలిసి పూజ గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. సాయంత్రం నుంచి పలాస రైలు నిలయం పరిసరాల్లో తిరుగుతూ అర్ధరాత్రి దాటాక పిల్లలతో కలిసి సోంపేటవైపు వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం జీఆర్పీ పోలీసులు పట్టాలపై మృతదేహాలను గుర్తించి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





