ఆలుమగల గొడవకు మూడు ప్రాణాలు బలి
కాశీబుగ్గ, పలాస, కోటబొమ్మాళి, : శ్రీకాకుళం జిల్లా పలాస రైలు నిలయం సమీపంలో ఘోరం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల వెంకటరావుతో సంతబొమ్మాళి మండలం కొత్తపేటకు చెందిన పూజ(28)కు 2019లో వివాహమైంది. వీరికి కుమారుడు కుశాంత్(7), కుమార్తె దీక్షిత(6) ఉన్నారు. ఉపాధిరీత్యా వెంకటరావు భార్యాపిల్లలతో కలిసి విజయవాడలో నివాసముంటున్నారు. ఇటీవల ఆయన సోదరి భర్త మృతి చెందడంతో పరామర్శకు స్వగ్రామానికి వచ్చారు.
వెంకటరావు తల్లి పాపమ్మ వృద్ధురాలు కావడంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు సపర్యలు చేసే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలతో కలిసి పూజ గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. సాయంత్రం నుంచి పలాస రైలు నిలయం పరిసరాల్లో తిరుగుతూ అర్ధరాత్రి దాటాక పిల్లలతో కలిసి సోంపేటవైపు వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం జీఆర్పీ పోలీసులు పట్టాలపై మృతదేహాలను గుర్తించి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.
Also read
- ముగ్గురు అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
- గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
- ‘మా అల్లుడు సైకో’.. టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు
- నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థిని బలవన్మరణం
- కన్నబిడ్డలతో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య





