హైదరాబాద్ మహానగరంలో స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న అసాంఘిక దందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం (జూన్ 05) అత్యంత భారీస్థాయిలో మూకుమ్మడి దాడులు జరిగాయి. నగర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిన ఈ దాడిలో ఏకంగా 500 మంది పోలీసులు ఒకేసారి రంగంలోకి దిగారు.
మల్కాజ్గిరి పరిధిలోని సుమారు 113 స్పా సెంటర్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్పా – మసాజ్ సెంటర్ల బోర్డుల వెనుక గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారం, డ్రగ్స్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాల గుట్టును ఈ తనిఖీల్లో రట్టు చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ఇప్పటివరకు 40కి పైగా కేసులు నమోదు చేయగా, నిర్వాహకులు, దళారులతో కలిపి మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో పోలీసులు కేవలం నిర్వాహకులపైనే కాకుండా, ఆయా స్పా సెంటర్లకు బిల్డింగ్లను అద్దెకు ఇస్తున్న యజమానులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని పలువురు బిల్డింగ్ ఓనర్లను పోలీసులు తీవ్రంగా విచారించారు. “అద్దెకు ఇచ్చిన బిల్డింగులలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై లేదా?” అని పోలీసులు ప్రశ్నించారు. ఈ దందాల గురించి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు. నగరంలో ఇలాంటి అక్రమ కేంద్రాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Also read
- భార్య బడిత పూజకు భర్త బలి
- అమీర్ పెట్ ప్రమాదం.. స్పాట్ కు ‘హైడ్రా’ రంగనాథ్
- ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
- లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
- ఇంట్లో పామును చంపారా? శాస్త్రం చెప్పిన నిజం తెలిస్తే వణకాల్సిందే!





