SGSTV NEWS online
CrimeTelangana

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..



సాధారణంగా మద్యం తాగి ఆటో నడిపే వారిని చూసాం.. కానీ ఇక్కడో ఆటో డ్రైవర్ మాత్రం అందుకు బిన్నంగా ఎలుకల మందు తాగి ఆటో నడిపాడు. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. విషం శరీరమంతా పాకడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఆరబోసిన వరికుప్పలను ఢీకొట్టి బోల్తా పడ్డాడు. ఇంతకు అతను ఎలుకల మందు ఎందుకు తాగాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.


సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్యా యత్నం కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్, ప్రాణాంతకమైన ఎలుకల మందు తాగి ఆటో నడిపి చివరకు హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ సమీపంలోని నేషనల్ హైవే 161 పై వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఆటో, రహదారిపై ఆరబోసిన వరి కుప్పలను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. తొలుత ఇది సాధారణ ప్రమాదమని భావించినప్పటికీ, అసలు విషయం తెలిసి స్థానికులు విస్మయానికి గురయ్యారు.


అయితే డ్రైవర్ ఆటో నడపడానికి ముందే ఎలుకల మందు సేవించినట్లు సమాచారం. డ్రైవింగ్ చేస్తుండగానే మందు ప్రభావంతో అతను అపస్మారక స్థితికి వెళ్లడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి వరి కుప్పలను ఢీకొట్టాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాద స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో కొందరి వ్యక్తుల పేర్లు రాసి, తన చావుకు వారే కారణమని బాధితుడు పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ సూసైడ్ నోట్‌లో ఉన్న వ్యక్తులు ఎవరు? వారితో డ్రైవర్‌కు ఉన్న గొడవలేంటి? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Also read

Related posts