ఎన్టీఆర్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. సినిమా ఫక్కీలో సాగిన హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. ఒక మద్యం సీసాపై ఉన్న QR కోడ్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారి, నిందితుల గుట్టును రట్టు చేసింది. తిరువూరు నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తిరువూరు నియోజకవర్గంలోని వడిత్య రాజేష్, అలేఖ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే, అలేఖ్యకు నున్న గ్రామానికి చెందిన క్రికెట్ స్టేడియం యజమాని చిలకల కృష్ణసేనతో ఏర్పడిన వివాహేతర సంబంధం ఈ దారుణానికి ఒడిగట్టేలా చేసింది. తన ప్రియుడితో కలిసి సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆమె పథకం వేసింది. ఏప్రిల్ 21వ తేదీన పక్కా ప్లాన్తో రాజేష్కు నున్న ప్రాంతంలో మద్యం తాగించారు. అనంతరం కడప జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్ సహాయంతో అతడిని హతమార్చారు. ఈ నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు, మృతదేహాన్ని కారులో తరలించి తిరువూరు సమీపంలోని చండ్రుపట్ల NSP కాలువలో పడేశారు.
రాజేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు, ఏప్రిల్ 22వ తేదీన జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఘటనాస్థలంలో లభించిన మద్యం బాటిల్ క్యూఆర్ (QR) కోడ్ పోలీసులకు అసలైన ఆధారాన్ని ఇచ్చింది. ఆ కోడ్ ద్వారా ఆ మద్యం ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించి, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితులా వివరాలు బయటపడ్డాయి.
చివరకు అలేఖ్య, ఆమె ప్రియుడు కృష్ణసేన సహా సుపారీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. క్షణికావేశం, అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





