SGSTV NEWS online
Andhra PradeshCrime

తెల్లారేసరికి షాప్‌ దగ్గరకు పరుగులు పెట్టిన యజమాని.. సీసీ కెమెరా చూడగా.. ‌



శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలు చేసిన వింత పూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలని స్థానికులు భయపడుతుండగా, ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.


మన చుట్టూ సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా, కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాత్రం వెన్నులో వణుకు పుట్టక మానదు. సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరలో చోటుచేసుకుంది. పగటిపూట రద్దీగా ఉండే అంబేద్కర్ సర్కిల్ ప్రాంతం, అర్ధరాత్రి పూట నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక వృద్ధురాలు చేసిన పనులు ఇప్పుడు ఆ ఏరియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి.


శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో, అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ ఒక వయసు మళ్లిన మహిళ అక్కడ ఉన్న ఒక వస్త్ర దుకాణం ముందు ఆగింది. ఆ తర్వాత ఆమె చేసిన పనులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆమె తన వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమ, అగరబత్తీలతో దాదాపు అరగంట పాటు ఆ షాపు ముందు వింత పూజలు నిర్వహించింది. ఉదయాన్నే షాపు తెరవడానికి వచ్చిన యజమాని, దుకాణం ముందు పసుపు, కుంకుమ చల్లి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.


వెంటనే భయంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆ వృద్ధురాలు చేసిన ‘వింత తంతు’ బయటపడింది. ఆ మహిళ ఎవరు? అసలు అర్ధరాత్రి పూట ఆ షాపు ముందే ఎందుకు పూజలు చేసింది? ఇవి క్షుద్రపూజలేనా? అనే సందేహాలు స్థానికులను వెంటాడుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోవచ్చని, అందుకే అలా చేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ చుట్టుపక్కల ఆమె ఎక్కడా కనిపించకపోవడం ఈ మిస్టరీని మరింత పెంచుతోంది. ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు, పద్ధతులు ఉండటం విచారకరమే అయినా, ప్రజల్లో ఉన్న భయాన్ని మాత్రం కొట్టిపారేయలేం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది.

Also read

Related posts