పెళ్లి రిసెప్షన్లో సంబరాలు కొనసాగుతుండగా.. ఒక్కసారిగా కత్తి దాడి కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రేమ వివాహం చేసుకున్న వరుడు చందక సాయి కుమార్పై, అభినందనలు తెలిపే పేరుతో స్టేజ్పైకి వెళ్లిన వ్యక్తి ఆకస్మికంగా దాడి చేశాడు. ..
పెళ్లి రిసెప్షన్ అంటే ఆనందం, శుభాకాంక్షల వేడుక. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పెళ్లి రిసెప్షన్కు వచ్చిన ఓ వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పాలకొల్లు 31వ వార్డు (క్రిస్టియన్పేట)లో ప్రేమ వివాహం చేసుకున్న చందక సాయి కుమార్పై రిసెప్షన్ సమయంలో దాడి జరిగింది. ఇటీవల నర్సాపురం ఆలయంలో సాయి కుమార్, సాయి శ్రీ దుర్గ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పెద్దలు కూడా అంగీకరించడంతో, వధువు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
అయితే సోమవారం రాత్రి జరిగిన ఈ రిసెప్షన్లో.. గోగులమండ శ్రీను అనే వ్యక్తి వరుడిని అభినందిస్తున్నట్టుగా స్టేజ్పైకి వెళ్లి, భుజంపై చేయి వేసి ఒక్కసారిగా కత్తితో మెడపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనును అడ్డుకుని స్టేజ్ నుంచి కిందకు నెట్టేశారు.ఈ దాడిలో సాయి కుమార్ స్వల్ప గాయాలతో తప్పించుకుని, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి చేరాడు. మరోవైపు దాడి చేసిన శ్రీను కూడా స్వల్ప గాయాలతో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పాలకొల్లు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్టాప్గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





