SGSTV NEWS online
Andhra PradeshCrime

వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చేదారిలేక..భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం


కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి

గాలివీడు: అధిక వడ్డీలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి.వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక.. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరూ తనువు చాలించారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని శెట్టివారిపల్లెలో నివాసం ఉంటున్న మారువేణి మల్లికార్జున (35), అతని భార్య రాణి (30) కుటుంబ అవసరాల కోసం పరిసర ప్రాంతాల వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు.

భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ అప్పుల భారం తగ్గ లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడం.. అప్పులు తీర్చేదారి లేక శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి 108 ద్వారా రాయచోటి ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం మల్లికార్జున మృతి చెందాడు.

ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ రాణి కూడా శనివారం రాత్రి తుది శ్వాస విడిచింది. కాగా తాము ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డీకి ఇచ్చినవారి వేధింపులే కారణమని చికిత్స పొందుతున్న సమయంలో రాణి వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలకు ఎవరు దిక్కుఅంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Also read

Related posts