సి.బెళగల్, గూడూరు: తన తల్లిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రశ్నించాడని యువకుడిని వేట కొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కె.శింగవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉగాది పండగకు గ్రామానికి చెందిన బోయ సొట్ట నాగన్న ఇంటికి రంగులు వేయడానికి అదే గ్రామానికి చెందిన మల్లికార్జున(27), తల్లి భాగ్యమ్మ కూలీలుగా వచ్చారు. సొట్ట నాగన్న తనతో అసభ్యంగా ప్రవర్తించాడని భాగ్యమ్మ తన కుమారుడికి తెలిపారు. దీంతో శుక్రవారం జరిగిన శ్రీరామనవమి ఉత్సవంలో మల్లికార్జున ఈ విషయమై నాగన్నతో ఘర్షణ పడి.. కాలితో తన్నాడు. గ్రామస్థులు ఘర్షణను సర్దుబాటు చేశారు. శనివారం సి.బెళగల్కు వెళ్లి కేసు నమోదు చేయిస్తానని మల్లికార్జున బయలుదేరాడు. విషయం తెలుసుకున్న నాగన్న, ఆయన కుమారులు వెంటనే వెళ్లి దారిలో ఈర్లదిన్నె వద్ద అతడిని అడ్డగించారు. గ్రామస్థులు సర్దిచెప్పి పంపారు. అనంతరం బోయ సొట్ట నాగన్న, బోయ పెద్ద సుంకన్న, బోయ సుధాకర్, బోయ చిన్న సుంకన్న, మరో ఇద్దరు వ్యక్తులు కాపుకాసి స్వగ్రామానికి తిరిగి వస్తున్న మల్లికార్జునను వెంబడించి పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. వేటకొడవళ్లతో అతని కుడి కాలిని నరికి, కొట్టి చంపారు.
ఘటనా స్థలాన్ని దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐ తబ్రేజ్ పరిశీలించి హత్యకు కారణాలపై విచారించారు. 2017లో బోయ సొట్ట నాగన్న కుమారుడు పెద్ద సుంకన్న.. మల్లికార్జున ఘర్షణపడగా కేసు నమోదైందని సీఐ తెలిపారు. హత్యకు ఇదీ కారణం అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదుమేరకు ఆరుగురిపై కేసు నమోదుచేసినట్లు వారు తెలిపారు.
శ్రీరామనవమి రోజున జరిగిన ఘర్షణపై పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని.. వారు చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు
Also read
- ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్ పై దాడి
- మహిళపై అసభ్య ప్రవర్తన.. ప్రశ్నించిన కుమారుడి దారుణ హత్య
- గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
- భార్యతో గొడవ.. అడొచ్చిన అత్తను చంపిన అల్లుడు
- కృష్ణా జిల్లాలో బాలుడి హత్య.. నానమ్మకు తీవ్రగాయాలు





