హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నాదర్గుల్ నుండి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైకర్ రైడర్ను ఈడ్చికెళ్లిన భయనక దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ ప్రాంతానికి చెందిన గొర్రెపోతుల వర్ధన్(19) నాదర్గుల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం (ఫిబ్రవరి 17) ఉదయం రోజులాగే కాలేజీకి బయలుదేరాడు వర్ధన్. నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే టిప్పర్ లారీని దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒక్కసారిగా రోడ్డు మీదికు రావడంతో.. ఆటో తగిలి బైక్ అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్ను ఈడ్చికెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ఘటనలో విద్యార్థి వర్థన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ టిప్పర్ను అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ను, ప్రమాదానికి కారణమైన ఆటోను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also read
- అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
- Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
- స్వామివారికి దాతలిచ్చిన బంగారు కిరీటం తాకట్టు – వచ్చిన డబ్బుతో వ్యాపారం
- Gudiwada Temple గుడివాడ ఆలయంలో కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
- స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..ఈ అసాధ్యురాలు




