SGSTV NEWS online
Andhra PradeshCrime

డెలివరీ బాయ్‌తో పెట్రోల్ తెప్పించి.. అతనిపైనే పోసి నిప్పంటించారు..



మనుషులు రోజురోజుకు ఎలా తయారవుతున్నారో చెప్పడానికి పరాకాష్ఠ ఈ ఘటన. కేవలం అనుమానంతో ఓ యువకుడ్ని సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు కొందరు వ్యక్తులు. అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే డౌట్ రావడంతో ఈ పనికి పూనుకున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల …

కేవలం ఒక అనుమానం.. కానీ పరిణామం మాత్రం అమానుషం. కడప జిల్లాలో ఓ ఆన్లైన్ డెలివరీ బాయ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం బాధితుడు కడపలోని రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం గంగన్నపల్లె గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు ఆన్లైన్ డెలివరీ బాయ్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతికి పార్సిల్ అందించే సమయంలో అతడు చనువుగా మాట్లాడుతున్నాడనే అనుమానం ఆమె కుటుంబ సభ్యుల్లో కలిగింది. ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేకుండానే యువతి తరపు బంధువులు తీవ్ర చర్యకు పాల్పడ్డారు. దిలీప్‌కు ఫోన్ చేసి “పెట్రోల్ కావాలి… తీసుకురాగలవా?” అని అడిగారు. అతడు తెచ్చిన పెట్రోల్‌ను అతనిపైనే పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు చెబుతున్నాడు.

కేవలం అనుమానాల ఆధారంగా ఇలాంటి దారుణానికి పాల్పడటం చట్టరీత్యా ఘోర నేరం. ఎవరైనా తప్పు చేసినట్టు అనుమానం వచ్చినప్పుడు మందలించడం లేదా పోలీసులను ఆశ్రయించడం సరైన మార్గం. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా ఓ యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం మనుష్యత్వానికే మచ్చ. ఇలాంటి ఘటనలు సమాజానికి తీవ్ర హెచ్చరిక. అనుమానం వచ్చినప్పుడు స్వతంత్రంగా తీర్పు చెప్పడం కాదు.. చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించడం మాత్రమే సమంజసం.

Also read

Related posts