SGSTV NEWS online
Andhra PradeshCrime

కుక్క కరవగానే వెంటనే రేబిస్ వ్యాక్సిన్ వేయించారు.. కానీ కొన్ని రోజుల తర్వాత..


విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు. బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలసలో తొమ్మిదేళ్ల ఏళ్ల బాలుడు రామవరపు రవణ మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం వరకు తన తల్లిదండ్రులు, స్నేహితులతో ఆడుతూ పాడుతూ చురుగ్గా గడిపిన రవణ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోకసముద్రంలో నింపింది. గత నెలలో రవణ వీధిలో ఆడుకుంటుండగా అతనిపై కుక్క దాడి చేసింది. ఆ కుక్క దాడిలో రవణతో పాటు మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రేబిస్ నివారణ కోసం అవసరమైన టీకాలు వేయించారు. టీకాలు వేసిన తర్వాత కొన్ని రోజులపాటు బాలుడు ఆరోగ్యంగానే కనిపించడం తల్లిదండ్రులు ఊరట చెందారు.

అయితే గత రెండు రోజుల క్రితం మంగళవారం రవణకు జ్వరం మొదలయ్యింది. కుటుంబ సభ్యులు ఆందోళనతో మళ్లీ బొబ్బిలి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి గమనించి వెంటనే విజయనగరం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే రవణ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. వీధి కుక్క కాటు తమ కుమారుడిపై ఇలా ప్రభావం చూపుతుందని ఊహించలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. బాలుడికి చనిపోయే ముందు రేబిస్ లక్షణాలు గమనించారు. అప్పటికే రేబిస్ టీకా వేసినప్పటికీ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడలేక పోయాడు. వైద్యులు రేబిస్ టీకా తో పాటు ఇతర మెరుగైన చికిత్స చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బొబ్బిలిలో చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో రవణతో పాటు గాయపడ్డ ఇతర చిన్నారులు సైతం ఆందోళన చెందుతున్నారు. చికిత్స పొందుతున్న తమ పరిస్థితి ఏంటని ఆవేదం వ్యక్తం చేస్తున్నారు..

Also read

Related posts