SGSTV NEWS online
Andhra Pradesh

కోనసీమలో మళ్లీ గ్యాస్‌ లీకేజీ – ప్రజల్లో ఆందోళన



రాజోలు (కోనసీమ) : అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద పైపు లైన్‌ నుంచి భారీగా గ్యాస్‌ లీకవడం కలకలం రేపుతోంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్‌ సమీప ప్రాంతమంతా వ్యాపించింది. ఇటీవల డ్రిల్లింగ్‌ పూర్తి చేసి రిగ్‌ తొలగించిన తర్వాత ఈ లీక్‌ జరిగిందని స్థానికులు తెలిపారు. గ్యాస్‌ లీక్‌తో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్ల కోనసీమ జిల్లాలో తరచూ ఇలాంటి గ్యాస్‌ లీక్‌లు జరుగుతున్నాయని, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ లీకేజీపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌ ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత నెల (జనవరి)5న మలికిపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ వెల్‌ వద్ద రిపేర్‌/రీ-డ్రిల్లింగ్‌ పనుల సమయంలో భారీ గ్యాస్‌ లీక్‌ జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఇది బ్లోఅవుట్‌గా మారి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వెంటనే సమీప గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించేశారు అధికారులు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also read

Related posts