SGSTV NEWS
Andhra PradeshCrime

పిఠాపురంలో అమానుషం

పిఠాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా పిఠాపురంలోని జగ్గయ్య చెరువు కాలనీలో బుధవారం అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల చిన్నారిని బావిలో పడేసి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జగ్గయ్య చెరువు ప్రాంతంలో పి.దుర్గారావు, అన్నవరం దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె శైలజ రెండేళ్ల క్రితం నరసింగపురం గ్రామనికి చెందిన పి.సతీష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఐదు నెలల క్రితం శైలజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి జగ్గయ్య చెరువులోని పుట్టింటిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో పాపకు పాలిచ్చేందుకు శైలజ నిద్ర లేచింది. పాప పక్కన లేకపోవడంతో కంగారు పడి పెద్దగా కేకలు వేసింది. పక్క గదిలో నిద్రిస్తున్న శైలజ తమ్ముడు లోవరాజు, ఆమె తల్లితండ్రులు లేచి ఇల్లంతా వెతికారు. ఇరుగుపొరుగు వారి సహాయంతో అందరూ కలిసి వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. దీంతో పాప తాత దుర్గారావు పోలీసులకు సమాచారం అందించారు. వారింటికి సమీపంలోని బావిలో చిన్నారి పడి ఉండడాన్ని గుర్తించారు. అక్కడే శైలజ తల్లి అన్నవరం సెల్‌ఫోన్‌ను గమనించారు. పాప మృతదేహాన్ని బయటకు తీసి పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. బావి పక్కన బాలిక అమ్మమ్మ సెల్‌ఫోన్‌ దొరకడంతో ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని ఎఎస్‌పి మానిష్‌ దేవరాజ్‌ పరిశీలించారు. ఘటన జరిగిన ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి ఉన్నాయి. హత్యను పక్కదారి పట్టించడానికి ఇలా చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ జి.శ్రీనివాస్‌ తెలిపారు.

Also read

Related posts

Share this