July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

Chiranjeevi: పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి

తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు.

హైదరాబాద్: తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనానిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి పోస్ట్ చేశారు.

అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ.. పవన్ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తోంది. ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది.

అలా బాధ పడుతున్న నా తల్లికి ఒక మాట చెప్పా. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది చెప్పాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలి. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్కల్యాణ్ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీ కోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి పవన్ను గెలిపించండి” అని చిరంజీవి కోరారు.

Also read

Related posts

Share via