SGSTV NEWS online
Andhra Pradesh

Tirumala News: తిరుమల ఘాట్ రోడ్లో.. అజ్ఞాత వ్యక్తి హల్చల్.. నేనే దేవుడిని అంటూ..?


సాధారణంగా తిరుమల క్యూలైన్లు కట్టుదిట్టమైన భద్రతతో.. నిరంతరం నిఘా నీడలో ఉంటాయి. అయితే.. ఈ క్రమంలో ఒక వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోయి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనకు వెంటనే సిగరెట్ కావాలని అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని డిమాండ్ చేస్తూ గొడవకు దిగాడు. సిబ్బంది అతడిని వారించడానికి ప్రయత్నించగా.. ఆ వ్యక్తి మరింత ఆవేశానికి లోనయ్యాడు.

Tirumala News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు
ఎంతో భక్తిశ్రద్ధలతో వేచి ఉండే క్యూలైన్ మార్గంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల మధ్య ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అకస్మాత్తుగా హల్చల్ చేశాడు. ఈ పరిణామంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

సదరు వ్యక్తి కేవలం సిబ్బందితోనే కాకుండా.. అక్కడున్న భక్తులను కూడా ఇబ్బందులకు గురిచేశాడు. ‘నేనే దేవుడిని.. నేను చెప్పింది వినకపోతే మిమ్మల్ని శపిస్తాను’ అంటూ పెద్దగా కేకలు వేస్తూ భక్తులను భయపెట్టాడు. సుమారు అరగంట పాటు సాగిన ఈ హంగామాతో క్యూలైన్లలో ఉన్న చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించిన భక్తులు అతడికి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

సమాచారం అందుకున్న తిరుమల భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని ఎంతో శ్రమించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. మతిస్థిమితం లేని కారణంగానే అలా ప్రవర్తించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తిరుమల వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనలు జరగడం భక్తుల భద్రతపై చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టంచేయాలని భక్తులు కోరుతున్నారు.

Also Read

Related posts