బోట్లవానిపాలెం మచిలీపట్నం : మద్యం మత్తు కన్నామమకారాన్ని చిదిమేసింది. నిద్రిస్తున్న కుమారుడి తలపై తండ్రి కర్రతో కొట్టి హతమార్చిన దారుణ ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్ళపాలెం పంచాయతీ బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. ఎస్సై రమేష్బాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లా రామ్మోహనరావు తాపీపని చేస్తుంటాడు. అతని కుమారుడు కల్యాణ చక్రవర్తి (31) మచిలీపట్నంలో ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకునేవాడు. రెండు రోజుల కిందట కల్యాణ చక్రవర్తి తండ్రిని కొట్టాడు. గురువారం రాత్రి కొడుకు మద్యం తాగి, బోట్లవానిపాలెంలో ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ సమయంలో తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నాడు. కుమారుడు తనను కొట్టిన విషయాన్ని మనసులో ఉంచుకున్న రామ్మోహనరావు నిద్రిస్తున్న కల్యాణ చక్రవర్తి తలపై కర్రతో కొట్టాడు. సున్నితమైన ప్రాంతంలో దెబ్బ తగలడంతో కల్యాణ చక్రవర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతను ప్రాణాలతో ఉన్నాడనే ఆశతో బందువులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కల్యాణ చక్రవర్తికి తండ్రి అంటే ఎనలేని ప్రేమ ఉండేదని, ఎవరైనా ఏమైనా అంటే సహించేవాడు కాదని బంధువులు చెబుతున్నారు. మద్యం మత్తులోనే కల్యాణ చక్రవర్తి తండ్రిపై దాడి చేశాడని, అదే మద్యం మత్తు తండ్రి రూపంలో అతని ప్రాణాలను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రామ్మోహనరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!
- కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా?





