ఆడపిల్లంటే అందరికీ చులకనే. పేదింట పుట్టినా.. పెద్దింట పుట్టినా.. ఆగచాట్లు తప్పవు. ఓ తండ్రి ఎందుకు అనవసరంగా పెంచాలని అనుకున్నాడేమో, పెంపకానికి డబ్బు వృద్ధా అవుతుందని భావించాడేమో.. ఓ అయ్యకు బేరం పెట్టాడు. డబ్బు కూడా ముట్టింది.. కానీ అంతలోనే అనుకోని సంఘటన చోటుచేసుకుంది..
గౌహతి, అక్టోబర్ 31: కాసులకు కక్కుర్తి పడిన ఓ కసాయి తండ్రి రోజుల కన్న బిడ్డను అమ్ముకున్నాడు. గడ్డు పేదరికంతో బాధపడుతున్న అతడు పొట్ట నింపుకోవడానికి కళ్లు తెరచి లోకం చూడని పొత్తిళ్లలోని పసికందును నిర్ధాక్షిణ్యంగా అమ్ముకున్నాడు. ఈ దారుణ ఘటన అస్సాంలోని ధేమాజీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అస్సాంలోని ధేమాజీ జిల్లాలో అక్టోబర్ 4న దిబ్రూగఢ్లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులైన ధిమాన్ బోరా, సబితా బోరా పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో ఆడ పిల్లను భారంగా భావించారు. దీంతో చేసేదిలేక 25 రోజుల కన్న బిడ్డను రూ.30,000కు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించి, బిడ్డను కాపాడారు. ఓ డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షించారు.
దీనిపై చైల్డ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు అందడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) దీనిపై స్పందించింది. పెగు సోహోరియా, ఆమె భర్తకు ఆ పసికందును రూ.30,000కు అమ్మేశారు. దీంతో సిలాపత్తర్లోని డాక్టర్ చంద్రజిత్ డోలే ఇంట్లో ఉన్న ఆ శిశువును రక్షించి స్వాధీనం చేసుకున్నారు. శిశువు తల్లిదండ్రులను గుర్తించి తమ వద్దకు రావాలని ఆదేశించింది. ఇక శిశువు విక్రయంలో బుబుల్ బోరా, దిలీప్ సైకియా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు
Also read
- Students protest | నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థుల నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్
- నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్పై ప్రత్యర్థి ఉండగానే..
- ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ
- నేటి జాతకము..13 ఫిబ్రవరి, 2026
- మహిళలు హనుమంతుడి పాదాలను తాకితే ఏమవుతుంది..? అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..





