October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఓరుగల్లు కేంద్రంగా మాయ దందా.. మనీ కోసం మాయగాళ్ల యవ్వారం గుట్టురట్టు..!

కాసులు ఇస్తే చాలు కులం – ఆదాయం, నివాసం, ఫ్యామిలీ మెంబర్, డిపెండెంట్, మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు. ఎనీ సర్టిఫికేట్ చిటికెలో అందిస్తున్న నకిలీ ముఠా గుట్టు రట్టైంది. ఫేక్ సర్టిఫికేట్స్ ఛలామణి చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎలాంటి సర్టిఫికెట్ అయినా సరే.. ఆ కేటుగాళ్లకు చేయి తడిపితే నిమిషాల్లో సర్టిఫికెట్ జారీ చేస్తారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో వాళ్లకు వాళ్ళే సాటి. ఒకటి కాదు రెండు కాదు 650 కి పైగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసి రెవెన్యూ అధికారులకు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఆ భాగోతం ఎలా బయటపడింది..? ఆ 420 గాళ్లను ఏం చేశారు..?

నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వరంగల్ ను షేక్ చేసింది.. ఓ ముఠా ఏకంగా తహసిల్దార్ సంతకంతో పాటు నకిలీ స్టాంపులు తయారు చేయించి, ఇంటి నుండే సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కేటుగాళ్లు జారీ చేసిన నకిలీ సర్టిఫికెట్ల భాగోతం తెలియక సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం తహసిల్దార్ కార్యాలయానికి ఓ బాధితుడు వెళ్ళగా అసలు భాగోతం బయట పడింది. నకిలీ అని గమనించిన వరంగల్ తహసీల్దార్ మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలింది. ప్రధాన సూత్రదారి తోపాటు ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు అయ్యారు.

వరంగల్ నగరంలోని ఎల్లంబజారుకు చెందిన సతీష్ అనే యువకుడు ఈ బట్టేబాజ్ భాగవతంలో కీలక పాత్రదారుడుగా పోలీసులు గుర్తించారు. కొంతమంది తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో మిలాఖత్ అయి నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెర లేపాడు. కాసులు ఇస్తే చాలు కులం – ఆదాయం, నివాసం, ఫ్యామిలీ మెంబర్, డిపెండెంట్, మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు ఇలా నకిలీ సర్టిఫికెట్ల తయారుచేసి ఐదు పదివేల రూపాయలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

కొన్ని సంవత్సరాలుగా ఈ దందా విచ్చలవిడిగా సాగుతూన్నప్పటికీ, రెండు రోజుల క్రితం రెన్యువల్ కోసం వెళ్తే భాగోతం బయటపడింది. బాలాజీనగర్‌కు చెందిన యువకుడు ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించాలనుకున్నాడు. ఇందుకు గతంలో ఎల్లంబజార్‌కు చెందిన సతీష్ వద్ద మనీ లెండరింగ్ కోసం సర్టిఫికెట్ అవసరం ఉండగా 5000 తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆగస్టు నెలలో సర్టిఫికెట్ గడువు ముగియడంతో రెన్యువల్ కోసం వరంగల్ తహసిల్దార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు తీసుకున్న వరంగల్ మండల తహసిల్దార్ ఇక్బాల్ అది నకిలీదని తన సంతకం కాదని గుర్తించారు. ప్రభుత్వ స్టాంపు కూడా తప్పుగా ఉందని గమనించి మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తాను గత సంవత్సరం పని చేసినప్పుడు ఎవరికి కూడా మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని అది నకిలీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే కాకుండా చాలామంది వద్ద డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశారని వారందరిపై చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తహసిల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ఇప్పటివరకు 640 నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అవసరాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు ఐదు వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.

తహసిల్దార్ సంతకాన్ని, ప్రభుత్వ ముద్రను ఫోర్జరీ చేసి నకిలీ ఆదాయం, డిపెండెంట్, ఫ్యామిలీ మెంబర్, మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు, వివిధ విలువైన సర్టిఫికెట్స్ క్షణాల్లో జారీ చేసినట్లు గుర్తించారు. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది పాత్రధారులుగా ఈ ఇంత పెద్ద భాగోతం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేయడానికి సహకరించిన డిటిపి, స్టాంపు వెండర్, సంతకం ఫోర్జరీ, దళారి, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారితో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via