చదువుకోని వాళ్లు మాయగాళ్ల వలలో పడుతున్నారంటే జాలీ పడవచ్చు..! కానీ చదువుకుని డిగ్రీలు చేత పట్టుకుని ఉద్యోగాల కోసం లక్షల్లో డబ్బులు కట్టి మోసపోతున్నారు. కట్టిన డబ్బులు తిరిగిరాక, ఉద్యోగం రాదని తెలిసి ఆ దంపతులు కుంగిపోయారు. చివరికి అవమాన భారంతో దంపతలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, సాయిరాంతండాకు చెందిన హాలవత్ రత్నకుమార్, పార్వతీ యువ జంట కొత్తగూడెంలోని ఒక వస్త్రాలయంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. సింగరేణిలో ఉద్యోగం చేయాలని భావించారు. ఇందుకు మధ్య దళారిని నమ్మారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కరీంనగర్కు చెందిన వ్యక్తి మాయలో పడ్డారు. నెల నెలా కొంచెం డబ్బు కూడబెట్టి, 16 లక్షలు పోగు చేసిన సొమ్మును అతనికి అప్పజెప్పారు. ఉద్యోగం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలోనే కరీంనగర్ చెందిన సదరు వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు ఆ దంపతులు.
ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి మృతి చెందడంతో చేసేదీ లేక, ఇచ్చిన డబ్బులు తిరిగిరావని తెలుసుకుని ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. ఇద్దరూ పురుగు మందు సేవించి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారిని కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి ఖమ్మంకు, ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలించారు. అయినప్పటికీ వారిని కాపాడలేకపోయారు. దంపతులిద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందడంతో బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తూన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




