సినిమాల ప్రభావమో.. సోషల్ మీడియా పైత్యమో.. తెలియదుగానీ నేటి కాలంలో పిల్లలు వయసుకుమించి ఆలోచిస్తున్నారు. అంతేనా.. చిన్న వయసులోనే ప్రేమ పేరిట జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్ బాలుడు నిండా 16 ఏళ్లు కూడా లేని వయసులో ప్రేమ పేరిట దారుణానికి పాల్పడ్డాడు..
నిర్మల్, ఫిబ్రవరి 24: వారిద్దరూ మైనర్లు. పట్టుమని నిండా 16 ఏళ్లు కూడా లేవు.. కానీ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఓ బాలిక వెంటపడుతున్న ఆ బాలుడు. అతగాడి ప్రేమను బాలిక తిరస్కరించడంతో నేరుగా ఆమె తండ్రి వద్దకు వెళ్లి మా ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగాడు. దీంతో ఖంగుతిన్న బాలిక తండ్రి ఇద్దరికీ పెళ్లీడు వచ్చాక చూద్దాలే.. అందాక తన కుమార్తె వెంటపడొద్దని నచ్చజెప్పి పంపించేశాడు. కానీ తమ పెళ్లికి అంగీకరించలేదనీ బాలిక తండ్రిపై పగ పెంచుకున్న బాలుడు.. పెద్దాయన అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఆయనను హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఈ షాకింగ్ ఘటన నిర్మల్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. సబ్ డివిజన్ ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..
నిర్మల్లో ఓ బాలుడు(16) మేస్త్రీగా పని చేస్తున్నాడు. బాలుడు నివసిస్తున్న అదే కాలనీకే చెందిన మరో బాలిక (16) వద్దకు వెళ్లి నాలుగేళ్లుగా తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని బాలికను అడుగగా ఆమె అంగీకరించలేదు. దీంతో నేరుగా బాలిక తండ్రి వద్దకు వెళ్లి తమకు పెళ్లి చేయమని అడిగాడు. బాలుడి మాటలకు విస్తుపోయిన బాలిక తండ్రి.. ఇద్దరి వయసు చిన్నదేనని, పెళ్లి వయసు వచ్చాక మాట్లాడదామని నచ్చజెప్పి పంపించేశాడు. ఇలాగైతే తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదన్న అక్కసు పెంచుకున్న బాలుడు.. బాలిక తండ్రిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో వైఎస్సార్ కాలనీకి చెందిన మహ్మద్ తౌసిఫ్ ఉల్లా (20)తో కలిసి పథకం పన్నాడు. శనివారం అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లి.. నిద్రిస్తున్న బాలిక తండ్రిపై కత్తెరతో దాడిచేసి, పలుమార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలుడితోపాటు, అతడికి సహకరించిన మహ్మద్ తౌసిఫ్ ఉల్లాను అరెస్టు చేసి, కోర్టు ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండుకు తరలించారు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





