SGSTV NEWS online
Andhra PradeshCrime

లైంగిక ఆరోపణలు.. లొంగిపోయిన చిన్నమల్లయ్య



పల్నాడు: ఏపీలో సంచలనం రేపిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల కేసు నేపథ్యంలో నెలకు పైగా అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎట్టకేలకు ఈ వేకువ జామున పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.



బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ తనపై అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో పరిచయం ఏర్పడిన సీఐ చిన్నమల్లయ్య.. తనను బెదిరించి లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖ స్పందించింది. చిన్నమల్లయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభమైంది. ఈలోపు.. చిన్నమల్లయ్య కనిపించకుండా పోవడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ తీరు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా.. ఆయన్ని విధుల నుంచి తొలిగిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇటు మొదట హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో చిన్నమల్లయ్యపై ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చిన్నమల్లయ్య చివరకు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయినట్లు స్పష్టమవుతోంది. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు.

Also read

Related posts