SGSTV NEWS
CrimeNational

హోంవర్క్ చేయని స్టూడెంట్.. తలకిందులుగా వేలాడదీసి శిక్ష.. క్రమశిక్షణ పేరుతో హద్దులు దాటేసిన టీచర్స్



పిల్లలు తల్లిదండ్రుల దగ్గర గడిపే సమయం కంటే టీచర్స్ దగ్గర గడిపే సమయమే ఎక్కువ. అందుకనే పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుడికి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చి ఆచార్య దేవో భవ అంటూ కీర్తించింది మన సమాజం. టీచర్స్ పిల్లల్ని తమ సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పేవారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా టీచర్ వృత్తిలో కూడా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చాలా మంది టీచర్స్ కు సహనం ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలకే స్టూడెంట్స్ కు దారుణమైన శిక్షలు విధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి రెండు సంఘటనలు వార్తల్లో నిలిచాయి. హోమ వర్క్ చేయని ఒక స్టూడెంట్ ని తాడుతో కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసిన దారుణ ఘటన ఒకటి కాగా.. మరొకటి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు చిన్న పిల్లలను దారుణంగా చెంపదెబ్బ కొట్టడం. ఈ దారుణ సంఘటనలు హర్యానా రాష్ట్రంలో పానిపట్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్ లో జరిగినట్లు తెలుస్తోంది.


హర్యానాలోని పానిపట్‌లోని ఒక పాఠశాల లో చోటు చేసుకున్న రెండు హృదయ విదారక చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విద్యార్థులను కొట్టడం, హింసించడం చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఒక విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆగ్రహాన్ని రేకెత్తించాయి. రెండు వీడియోలు జాతల్ రోడ్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌కు చెందినవని తెలుస్తోంది. ఒక వీడియోలో రెండవ తరగతి విద్యార్థిని కిటికీకి తాడుతో తలక్రిందులుగా వేలాడదీసి, హోంవర్క్ చేయనందుకు కొట్టారు. మరొక వీడియోలో ఒక ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు చిన్న పిల్లలను దారుణంగా చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ అమానవీయ సంఘటన, పిల్లల రక్షణ చట్టాలు, విద్యా సంస్థల జవాబుదారీతనం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

రెండో తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసిన టీచర్
ముఖిజా కాలనీకి చెందిన డాలీ మాట్లాడుతూ.. తన 7 ఏళ్ల కొడుకును ఈ సంవత్సరం ఈ స్కూల్లో చేర్చినట్లు చెప్పింది. తన కొడుకు చేసిన ఏకైక తప్పు.. హోంవర్క్ చేయకపోవడమే. మహిళా టీచర్ స్కూల్ డ్రైవర్‌కి ఫోన్ చేసి.. ఈ పిల్లవాడిని శిక్షించండి.. తద్వారా తాను చేయాల్సిన పనిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు’ అని చెప్పింది.” ఆ తర్వాత డ్రైవర్ అజయ్ క్రూరత్వానికి ఉన్న అన్ని పరిమితులను దాటాడు. అతను తన కొడుకును మేడమీద ఉన్న గదికి తీసుకెళ్లి, తాళ్లతో కట్టి, కిటికీకి తలక్రిందులుగా వేలాడదీశాడు. ఇంకా తన కొడుకును చెంపదెబ్బ కొట్టాడు. అంతేకాదు అజయ్ తన స్నేహితులకు వీడియో కాల్ చేసి కొట్టడాన్ని చూపించాడు. ఆ తర్వాత అతను ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడని స్టూడెంట్ తల్లి చెప్పింది. ఆ వీడియో తన వద్దకు చేరినప్పుడు అది చూసి చాలా ఆశ్చర్యపోయాను” అని చెప్పింది.




వివరణ ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపాల్
పాఠశాలలో మరో మహిళా ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలపై శారీరకంగా దాడి చేస్తున్నట్లు కనిపించే మరో వీడియో కూడా బయటపడింది. ఆ వీడియోలో ఆమె ఒక పిల్లవాడిని ముందుకు పిలిచి, అతని చెవులను పట్టుకుని, బలంగా చెంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆమె తన వెనుక నిలబడి ఉన్న మరో పిల్లవాడిని కొట్టడం ప్రారంభించింది. ఇతర విద్యార్థుల ముందు.. బహిరంగ ప్రదేశంలో కూర్చున్న పిల్లలపై దాడి చేసింది. అయితే ఈ విషయంపై టీచర్ మాట్లాడుతూ.. తాను కొట్టిన విద్యార్థులు ఇద్దరు స్టూడెంట్స్ పట్ల “చెడుగా” ప్రవర్తించారని చెప్పింది. ఇదే వివరణ ప్రిన్సిపాల్ రీనా కూడా చెప్పింది.
పిల్లలు సరైన మార్గంలో పయనించేలా ” ఈ చర్య తీసుకున్నామని.. ఇలా చేసే ముందు పిల్లల కుటుంబాలకు తెలియజేశానని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అయితే బహిరంగంగా పిల్లలను చెంపదెబ్బ కొట్టడం విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధం. అంతేకాదు ఈ స్కూల్ లో స్టూడెంట్స్ కి శిక్షగా కొంతమంది విద్యార్ధులతో బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డ్రైవర్ తొలగింపు
బాధితురాలి తల్లి డాలీ.. స్కూల్ ప్రిన్సిపాల్ ని కలిసి ఇలా ఎలా కొడతారు అడిగినప్పుడు.. ఆమె సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. అజయ్ కనిపించడం లేదని తెలిపింది. అయితే బాధితురాలి తల్లి డాలీ.. తనకు అజయ్ ఫోన్ చేసి బెదిరించడమే కాదు.. దాదాపు 25 మంది గూండాలను తన ఇంటికి పంపాడని.. ఆరోపించింది. అయితే ఇదే విషయంపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… పిల్లల పట్ల డ్రైవర్ ప్రవర్తన అనుచితంగా ఉందని.. అనేక ఫిర్యాదుల తర్వాత ఆగస్టులో అజయ్ ని తొలగించామని రీనా పేర్కొంది.

టీచర్-డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
అయితే బాధితురాలి కుటుంబం తరువాత మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే చర్య తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితురాలైన మహిళా టీచర్, డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Also read

Related posts