October 16, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఏపీలో మరో మూడు నెలలు ఆ బ్రాండ్‌లే అమ్మకం… కొత్త మద్యం పాలసీ వచ్చేది అప్పుడే…

AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తి కావొస్తున్నా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ బ్రాండ్ల అమ్మకాలే కొనసాగుతున్నాయి. మరికొన్ని నెలల పాటు పాత బ్రాండ్ల అమ్మకాలే సాగనున్నాయి.

ఏపీలో మరికొన్నాళ్ళు ఆ బ్రాండ్ల మద్యమే అమ్మకం
AP Liquor Syndicates: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడానికి మరికొన్ని నెలలు సమయం పట్టనుంది. ప్రస్తుత మద్యం పాలసీ గడువు 2024 అక్టోబర్ వరకు ఉండటంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అప్పటి వరకు పాత విధానాన్నే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు.

నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా దుకాణాలకు చేరిపోయే మద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఐదేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసింది. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి విక్రయాలు జరిపారు. 2019మే నాటి ఉన్న ధరలతో పోలిస్తే 2024నాటికి అవి దాదాపు రెట్టింపు అయ్యాయి.

తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామని, ధరలు కూడా తగ్గిస్తామని, టీడీపీ, జనసేనలు ఎన్నికల ప్రచారంలో ప్రకటించాయి. ఏపీ మద్యం విక్రయాలపై విచారణ జరిపిస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమివ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గుతాయని, అన్ని పాపులర్ బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని జనం భావించారు. ఎన్నికల సమయంలో వైసీపీ “జే ” బ్రాండ్లను తొలగిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు.

ప్రస్తుత మద్యం పాలసీ గడువు అక్టోబర్ వరకు ఉండటంతో ఇదే పాలసీ మరో మూడు నెలలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లిక్కర్‌ పాలసీని కొనసాగిస్తున్నారు. దీంతో గత ఐదేళ్లలో విక్రయాలు జరిపిన మద్యం బ్రాండ్లే ఇంకా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త పాలసీపై సిండికేట్ల కన్ను…
కొత్త మద్యం పాలసీపై లిక్కర్‌ సిండికేట్లు కన్నేశాయి. ఐదేళ్లుగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రభుత్వం విక్రయించిన మద్యం నాణ్యత, ధరలపై ఎన్ని విమర్శలు ఉన్నా మద్యం ద్వారా లభించిన ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త లిక్కర్‌ పాలసీ ప్రవేవపెడుతుందనే వార్తల నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మద్యం దుకాణాలను దక్కించుకోడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐదేళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీలు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

కళ్లు చెదిరే ఆదాయం..
ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా రూ.36వేల కోట్ల రుపాయల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో నాలుగో వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు రూ.27వేల కోట్ల రుపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా లభించేది. 2019కు ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి.

ఏం జరిగిందంటే?
అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్నివైసీపీ గణనీయంగా పెంచేసింది. 2019 ధరలకు రెండు రెట్లు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇతర మార్గాలను అన్వేషించారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం రవాణా అయ్యేది. అక్రమ రవాణా నిరోధంతో పాటు నాటుసారా తయారీని అరికట్టడానికి సెబ్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవేమి ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ధరల్ని కొంత తగ్గించారు. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ మద్యం దుకాణాలు..
2019కు ముందు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చాలా భాగం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగింది. గతంలో మద్యం తయారీ దారులు, విక్రయదారులు, లీజుదారులు, రాజకీయ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పెట్లో పెట్టుకునే వారు. 2019 నుంచి వీటికి అడ్డుకట్ట పడింది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించే విధానం చాలా కాలం క్రితమే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉంది. ఢిల్లీలో ఇటీవల లిక్కర్ పాలసీ స్కామ్‌ రాకముందు వరకు సమర్ధవంతంగా ప్రభుత్వ దుకాణాల వ్యవస్థ నడిచేది.దీని వల్ల కల్తీ మద్యం, నాసిరకం విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. ఏపీలో కూడా ఈ తరహా దుకాణాలను ప్రవేశపెట్టిన మరో పద్ధతిలో అక్రమాలు జరిగాయి. పూర్తిగా నగదుతోనే మద్యం విక్రయించడం, కొన్ని బ్రాండ్లను మాత్రమే అనుమతించడం ద్వారా కావాల్సిన వారికి మాత్రమే మద్యం అమ్ముకునే అవకాశం కల్పించారు.

కొత్త మద్యం పాలసీ రూపకల్పన నేపథ్యంలో లిక్కర్ సిండికేట్ల ఒత్తిళ్లకు తలొగ్గితే చంద్రబాబు ప్రభుత్వం విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడానికి కారణమయ్యారనే నిందను మోయాల్సి రావచ్చు.

మద్యం మాత్రమే ప్రభుత్వం విక్రయించే వెసులుబాటు…
సాధారణంగా ఏ ఆహార ఉత్పత్తినైనా తయారీదారుడే స్వయంగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కేవలం మద్యం తయారీకి మాత్రమే వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. విక్రయాలను మాత్రమే ప్రభుత్వమే నిర్వహిస్తుంది.డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్ని బేవరేజీస్ కార్పొరేషన్ ద్వారా దుకాణాలకు సరఫరా చేసేవారు. ఉత్పాదక వ్యయం కంటే 100 నుంచి 200శాతం అదనంగా పన్నులు వేసి బ్రాండ్లను బట్టి నాణ్యత ఆధారంగా మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో గరిష్టంగా 8శాతం వరకు దుకాణాలకు కమిషన్‌గా వెళ్లేది. గతంలో 2019 వరకు వేలం పాట ద్వారా నిర్దిష్ట కాలపరిమితికి దుకాణాలను కేటాయించేవారు. ఇందులో లిక్కర్ సిండికేట్లకు కాసుల వర్షం కురిసేది.

గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. 2018-19లో దాదాపు రూ.16వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం ఐదేళ్లలో రూ.36వేల కోట్లకు చేరింది. ఇందులో ఉత్పాదక వ్యయం, కమిషన్లు పోగా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. అయితే డిస్టిలరీను గత ప్రభుత్వంలో పెద్దలు చేజిక్కించుకుని భారీగా లాభపడ్డారనే విమర్శలు ఉన్నాయి. మద్యం వ్యాపారాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒత్తిళ్లను తట్టుకోలేక వ్యాపారాల నుంచి పక్కకు తప్పకున్నారని ప్రచారం జరిగింది.

2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు. వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది. మద్యం ధరలు భారీగా పెరగడం, నాసిరకం బ్రాండ్లను విక్రయించడంతో ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది.

మద్యం ధరల నిర్ణయాధికారం ఎవరిది?
సాధారణంగా ఏ ఉత్పత్తినైనా ఎంత ధరకు విక్రయించాలనేది తయారీదారుడే నిర్ణయిస్తాడు. మద్యం మాత్రం ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలనేది ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుంది. దీని చట్టబద్ధతపై కూడా సందేహాలున్నాయి. మద్యం నాణ్యతను, రసాయినిక ప్రమాణాలను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వ కమిటీలకు ఉండగా ధరలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి చాలా కాలంగా ఉంది. మద్యం ఆదాయం ప్రభుత్వానికి వస్తుండటంతో దీనిని ప్రశ్నించిన వారు కూడా లేరు.

దుకాణాలకు అప్పగిస్తే జరిగే దారుణాలు ఎన్నో…
మద్యం విక్రయాలను గతంలో మాదిరి దుకాణాలకు అప్పగిస్తే దాంట్లో భారీగా అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. మద్యం దుకాణాలు-రాజకీయ నాయకులు- డిస్టిలరీలు కుమ్మక్కవుతాయి. దుకాణాలకు విక్రయాలతో వచ్చే 8శాతం కమిషన్‌లోనే షాపుల అద్దెలు, సిబ్బంది జీతాలు, ఎక్సైజ్‌ సిబ్బందికి మామూళ్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కమిషన్‌ ఏ మాత్రం లాభదాయకం కాకపోయినా మద్యం సిండికేట్లు దుకాణాలు కావాలని ఒత్తిళ్లు పెంచడం వెనుక పెద్ద దందా ఉంటుంది. డిస్టిలరీలు బేవరేజీస్‌ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సరఫరా చేసే మద్యంతో పాటు నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తుంటాయి. మద్యాన్ని 20-30శాతం కల్తీ చేయడం ద్వారా లాభాలను పెంచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా మద్యం దుకాణాలను దక్కించుకునే వారు బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు పెంచుకుంటారు. ఇదంతా ఓ దోపిడీ ఛైన్‌‌గా మారుతుంది.

ప్రభుత్వానికి ఆదాయ వనరు…
మద్యం రిటైల్ వ్యాపారంలో ప్రభుత్వం ఉండటం వల్ల సిండికేట్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచితే ఏ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలనే విచక్షణ వినియోగదారుడికి లభిస్తుంది. ఫలితంగా నాణ్యత విషయంలో కూడా కంపెనీలు రాజీపడకుండా ఉంటాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని బ్రాండ్ల లభ్యతే అధికంగా ఉంటుంది. బ్రాండ్లను ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారుడికి ఉండదు. గతంలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు ఎక్కువగా జరిగేవి. ప్రభుత్వ మద్యం దుకాణాలతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా దుకాణాల ముందు క్యూలైన్లలో పడిగాపులు పడే పరిస్థితి కల్పించారు.

ఇథనాల్ ఫార్ములాతో ధరల నిర్ణయం…
ప్రభుత్వానికి మద్యం నాణ్యతను నిర్ధారించడం, నాణ్యతా ప్రమాణాలను పాటించేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. అయా డిస్టిలరీలు ఇచ్చే ఇథనాల్ ఫార్ములా ఆధారంగా వాటికి అనుమతులు, ధరలను నిర్ణయిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా కమిటీల పేరుతో లిక్కర్ డిస్టిలరీలను లొంగదీసుకోవడంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

మద్యం తయారీ, నాణ్యత, కొత్త బ్రాండ్లకు అనుమతించే విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. దీంతో డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలు పెట్టే కండిషన్లకు తలొగ్గుతున్నారు. అన్ని బ్రాండ్లను అనుమతించి, కోరుకున్న బ్రాండ్‌ ఎంచుకునే స్వేచ్ఛ మద్యం సేవించే వారికి ఇస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయనే వాదన ఉంది.

లిక్కర్ మార్ట్‌ల సంఖ్యను పెంచడం ద్వారా ప్రభుత్వ వ్యాపారాన్ని పెంచుకోవచ్చనే సూచనలు ఉన్నాయి.ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ విధుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో అదనంగా ఉన్న సిబ్బందిని వినియోగించుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బంది గతంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన వారు కావడంతో గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రధాన బ్రాండ్లను పక్కదారి పట్టించడం, డిమాండ్‌ను బట్టి బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మద్యం దుకాణాల్లో జవాబుదారీ తనంతో కూడిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. విక్రయాలకు డిజిటల్ చెల్లింపులు, గోడౌన్ల నుంచి తరలించే సమయంలో ట్రాకింగ్, సీసీ కెమెరాలఏర్పాటు ద్వారా సమర్ధవంతంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Also read :Sircilla Police: అందులో రాష్ట్రంలో నెం.1 స్థానం.. సిరిసిల్ల జిల్లా పోలీసుల ఘనత

Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ..అక్కడ ఏం జరుగుతోంది..?

ఆంధ్ర ప్రదేశ్ : అంతా పొలానికెళ్లారు.. ఆ ఇంట్లో నుంచి ఏదో శబ్ధం వస్తుందని చూడగా..

అదే ఆఖరి సెల్ఫీ అయింది.. ముగ్గురూ సరదగా ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఫుల్లుగా తాగి మంత్రి కారునే అడ్డుకున్నారు.. కట్ చేస్తే.. సీన్ సీతార్ అయ్యిందిగా..

Related posts

Share via