గరుడ పురాణం అంటే మరణానంతరం ఆత్మ ప్రయాణం, నరకంలో శిక్షలు మాత్రమే అనుకుంటే పొరపాటే. గరుడ పురాణం ఆరవ అధ్యాయంలో జనమరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది. ఇందులో జీవుడు పుట్టుక గురించి క్షుణ్ణంగా వివరించారు.
గరుడపురాణం ఆరవ అధ్యాయంలో జనమరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది. గర్భస్థ శిశువు వర్ణన, శిశువు అవస్థ, శిశువుకు జ్ఞానం కలగటం, జననం మరలా అజ్ఞానంలో పడటం, తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన ఉంటుంది. జన్మ రాహిత్యం జ్ఞానులకు, పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది. పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు. ఇందులో భాగంగా గర్భస్థ శిశువు పడే వేదనెలా ఉంటుందంటే…
గరుడ పురాణం ప్రకారం…జీవుడు ప్రాణం విడిచిన తర్వాత..చేసిన పాపపుణ్యాలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మను అనుసరించి నిర్ధిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన తర్వాత తొమ్మది నెలల పాటూ గత జన్మ పాపపుణ్యాలను తలుచుకుని గర్భంలోనే నరకం చూస్తాడు.
కడుపులో పడిన తర్వాత
👉 అయిదు రోజులకు బుడగ ఆకారంలో ఉంటాడు
👉 పది రోజులకు రేగుపండంత ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు
👉 నెలరోజులకు తలభాగం తయారవుతుంది
రెండు నెలలకు చేతులు, భుజాలు ఏర్పడతాయి
👉 మూడు నెలలకు చర్మం, గోళ్లు, రోమాలు, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి
👉 ఐదు నెలలకి ఆకలి దప్పికలు తెలుస్తాయి
ఆరు నెలలకు మావి ఏర్పడి నెమ్మదిగా కదలికలు మొదలవుతాయి
👉 అప్పటి నుంచీ తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పెరుగుతాడు జీవుడు.
కడుపులో బిడ్డ ఆలోచనలు
👉 ఏడవ నెలకి జ్ఞానోదయమై కడుపులో అటు ఇటూ కదులుతూ గత జన్మలో చేసిన పాప పుణ్యాలు తలుచుకుంటాడు.
👉 అర్జించిన సంపదలను అనుభవించిన వారే తనను నిర్లక్ష్యం చేసిన క్షణాలు గుర్తుచేసుకుని ఏడుస్తాడు
👉 దుర్గంధ భూయిష్టమైన ఈ గర్భకూపం నుంచి త్వరగా బయటకు త్రోసి వేయి తండ్రీ…మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను, త్వరగా మోక్షప్రాప్తిని కలిగించు అని ప్రార్ధిస్తాడు.
👉 ఇలా ఏడుస్తూ వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడవడం మొదలు పెడతాడు.
👉 ఆ తర్వాత తన అధీనంలోంచి పరాధీనంలోకి వెళ్లి ఇష్టాయిష్టాలు, శరీర బాధలు చెప్ప లేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి అడుగుపెడతాడు
👉 యవ్వనంలో ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలు మూటగట్టుకుని తిరిగి వృద్ధాప్యానికి చేరుకుని మరణిస్తాడు
తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరో జన్మెత్తుతాడు.
ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం చెబుతోంది.
