చేబ్రోలు హత్య కేసును ఛేదించిన పోలీసులు
ప్రియుడు, అతని స్నేహితుడితో కలసి భార్య ఘాతుకం
నిందితుల అరెస్టు, కారు స్వాదీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ బిందుమాధవ్
పిఠాపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తాళి కట్టిన భర్తను ప్రియుడితో కలసి అతి కిరాతకంగా సర్జికల్ బ్లేడుతో హత్య చేసింది ఆమె. మార్చి మూడో తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 216 జాతీయ రహదారి పక్కన లభ్యమైన వ్యక్తి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కత్తిపూడి-కాకినాడ జాతీయర రహదారి పక్కన కల్వర్టు వద్ద పంట బోదెలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. చేబ్రోలు వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ మృతదేహంపై గాయాలు ఉండడంతో సీఐ జి. శ్రీనివాస్ హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో ఎన్డీపీఓ దేవరాజ్ మనీష్ పాటిల్ మార్గదర్శకంలో సర్కిల్ ఎస్సైలు నాలుగు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంతో పాటు, సరిహద్దు రాష్ట్రాల మిస్సింగ్ కేసుల డేటా, హైవే సీసీ కెమెరా ఫుటేజీ, టోల్ ప్లాజా, సెల్ టవర్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28న అనకాపల్లి జిల్లా ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. అక్కడి ఎఫ్ఎఆర్లో పేర్కొన్న వ్యక్తి వివరాలతో ఇక్కడి లభ్యమైన మృతదేహం వివరాలు పోలి ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిళ్ల లోవరాజుగా గుర్తించారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన అతని భార్య శ్యామల, భర్త బంధువు అయిన మోహన్ కుమార్తో వివాహేతర సంబంధం నెరపుతూ తమకు అడ్డంగా ఉన్న భర్తను తొలగించాలని భావించింది. పథకం ప్రకారం ప్రియుడు మోహన్ కుమార్, అతని స్నేహితుడు గంగాధర్, ముగ్గురూ కలిసి గత ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి లోవరాజును హత్య చేసి మృతదేహాన్ని చేబ్రోలు హైవే వద్ద పడవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. హత్య చేయడానికి రెండు సర్జికల్ బ్లేడ్లను సిద్ధం చేసుకుని, పిల్లలు పడుకున్నాక మోహన్కుమార్, గంగాధర్ ఇంటిలోకి ప్రవేశించి లోవరాజుపై దాడి చేసి బ్లేడ్లతో పీకకోసి, గుండెల్లో పొడిచినట్టు పోలీసులు తెలిపారు.
రాంబాబు అరవడానికి ప్రయత్నంచగా నోట్లో గుడ్డలు కుక్కేసారని, అప్పటికీ లోవరాజు చనిపోకపోవడంతో కాలి చీలమండ కోసి రక్తం పోయేలా చేసి హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తమకు పరిచయం ఉన్న ప్రాంతమైన చేబ్రోలు హైవే పక్కన పడేసి పరారయ్యారన్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ, ఎస్ఐటీ సిబ్బందిని ఆయన ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..