SGSTV NEWS online
CrimeTelangana

లక్షల్లో జీతం వస్తున్నా ఇదేం కక్కుర్తి సార్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో




బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ చేసేందుకు రూ.25వేల లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రాంచందర్‌ నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మంగళవారం తన కార్యాలయంలోనే నేరుగా రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. మహబూబ్‌నగర్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. ఊట్కూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి తనతో పాటు తన స్నేహితులకు సంబంధించి బర్డ్ సర్టిఫికెట్స్ కోసం గతేడాది జులైలో మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటిని ఊట్కూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించారు. వాటిని అక్కడే కలెక్ట్ చేసుకోవాలని సూచించారు.

అయితే దరఖాస్తు చేసిన వ్యక్తి.. తన బర్త్‌ సర్టిఫికెట్ కోసం అప్పటి నుంచి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఈ సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఒక్కో జనన ధ్రువీకరణ పత్రానికి రూ. 7500 చొప్పున లంచం ఇవ్వాలని ఆర్డీవో రామచందర్ నాయక్ డిమాండ్ చేసినట్టు బాధితుడు ఆరోపించాడు. చివరకు ఎలాగోలా రూ. 5వేల చొప్పున రూ. 25 వేలు చెల్లించాలని తనతో ఆర్డీఓ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అలాగే తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

అయితే ఆర్డీవో బండారం బయటపెట్టేందుకు ఏసీబీ అధికారులు బాధితుడితో కలిసి ప్లాన్ వేశారు. అధికారుల సూచన మేరకు బాధితుడు మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాంచందర్‌ను కలిసి రూ.25 వేలు లంచం ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు ఆర్డీవోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రం బాబాకాలనీలోని ఆయన నివాసంలో సైతం అధికారులు తనిఖీలు చేపట్టారు. నిందితుడిని అరె‌స్టచేసి హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Also read

Related posts