SGSTV NEWS online
CrimeTelangana

కారులో ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు.. రాత్రయిందంటే చాలు ఏం చేస్తారో తెల్సా



పురుషుల్లో పుణ్య పురుషులు వేరేయా అన్నట్లుగా దొంగల్లో కూడా దర్జా దొంగలు ఉన్నారు. సాధారణంగా దొంగలు పగటి పూట రెక్కి చేసి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటారు. డబ్బులు, బంగారం కొల్లగొడతారు. కానీ ఈ దొంగలు ఖరీదైన కార్లలో తిరుగుతూ.. సూట్ బూటుతో పగటిపూట పరిసరాలను గమనిస్తుంటారు. అందరూ దొంగల మాదిరిగా కాకుండా.. వీరు.!


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొంతకాలంగా మేకలు, గొర్రెల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఈ దొంగతనాలపై దృష్టి సారించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చింతపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. AP 37BZ 5666 అనే నెంబర్ గల కారు అనుమానదస్పదంగా కనిపించింది. కారులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వారిని చెక్ చేయగా.. వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలింది. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు.


ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్మలూరి విజయ ప్రసాద్, నందిని, నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం రాంనగర్ కాలనీకి చెందిన దాసర్ల వినోద్ కుమార్, గుంజ కార్తీక్, హాలియా మండలం అలీనగర్‌కు చెందిన శారద ఈజీ మనీ కోసం గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా పగటివేళ ఖరీదైన కార్లలో సూటు బూటు వేసుకుని రిక్కీ నిర్వహిస్తారు. రాత్రివేళ గొర్రెలు, మేకలను కార్లలో వేసుకుని మేకల దొంగతనాలకు పాల్పడతున్నారు.

దొంగలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు. మేకల దొంగతనాల్లో వీరంతా గతంలో జైలుకు వెళ్లారు. బెయిల్‌పై వచ్చినా ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి నేరాలు చేస్తున్నారు. వీరిపై చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, కల్వకుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో మేకల దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి లక్షా ఇరవై వేల రూపాయల నగదు, మూడు కార్లు సీజ్ చేశారు. అంతర్ జిల్లా దొంగల ముఠాలోని వెంకటేష్, శబరిష్‌లు పరారీలో ఉన్నారని దేవరకొండ ఎఎస్పీ మౌనిక రెడ్డి తెలిపారు

Also Read

Related posts