SGSTV NEWS online
CrimeTelangana

చదివేది పదో తరగతి.. చేసే పనులు మాత్రం.. !




హైదరాబాద్‌ మహానగరంలోని కూకట్‌పల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలో, పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు విలాసాల కోసం దారితప్పి వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ కుర్రాడిని నిలదీయడంతో అసలు యవ్వారం బయటపడింది.


కూకట్‌పల్లి దయార్‌గూడ, సంగీత్‌నగర్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు స్థానిక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, గత కొంతకాలంగా వీరు గాయత్రినగర్, బాలాజీనగర్, సప్తగిరికాలనీ ప్రాంతాల్లో వరుసగా నాలుగు ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెంచారు.

సోమవారం (ఏప్రిల్ 20) కూకట్‌పల్లి బస్టాపు వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక విద్యార్థి వాహనంతో అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ఆపి విచారించగా, అసలు విషయం బయటపడింది. మిగిలిన ఇద్దరు మిత్రులతో కలిసి తాను చేసిన దొంగతనాల చిట్టాను ఆ బాలుడు పోలీసుల ముందు విప్పాడు. ఆ ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.


చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన వయసులో, ఈ విద్యార్థులు కటకటాల పాలయ్యారు. పోలీసులు వారిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత నిశితంగా గమనించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. చిన్న వయసులో చేసే తప్పులు జీవితాంతం మాయని మచ్చగా మిగిలిపోతాయనడానికి ఈ ఘటనే నిదర్శనం..!

Also read

Related posts