SGSTV NEWS online
Andhra PradeshCrime

రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!





గంజాయి వ్యసనం యువకులను నేరాల బాట పట్టిస్తోంది. మత్తు కోసం డబ్బులు సమకూర్చుకునేందుకు రైతుల పొలాల్లోని బోర్ మోటార్లనే టార్గెట్ చేసిన ఓ దొంగల ముఠాను ముసునూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించిన ఈ ముఠా గుట్టు రట్టవడంతో స్థానికంగా సంచలనం నెలకొంది.


ఏలూరు జిల్లా ముసునూరు మండల పరిధిలో గత కొంతకాలంగా రైతుల పొలాల్లోని బోర్ల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు ధ్వంసమవుతూ, వాటిలోని విలువైన రాగి తీగలు చోరీకి గురవుతున్నాయి. సుమారు పది మంది రైతులు ఈ దొంగతనాల కారణంగా నష్టపోయారు. దీంతో అప్రమత్తమైన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముసునూరు ఎస్.ఐ చిరంజీవి నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా కాపర్ వైర్లు తరలిస్తున్న ఐదుగురు యువకులు కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. గంజాయికి బానిసలైన వీరు ఒక ముఠాగా ఏర్పడి రైతుల పొలాల్లోని మోటార్లను ధ్వంసం చేసి రాగి తీగలను దొంగిలిస్తున్నట్లు అంగీకరించారు. అనంతరం వాటిని స్థానిక వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బుతో గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.


ఈ కేసులో దొంగిలించిన రాగి తీగలను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యాపారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను గురువారం (జూన్ 18) నాడు సి.ఐ నాగేంద్రకుమార్ పర్యవేక్షణలో నూజివీడు పట్టణ ప్రధాన వీధుల్లో నడిపిస్తూ కోర్టులో హాజరుపరిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఈ కాపర్ దొంగల ముఠాను పట్టుకున్న పోలీసు బృందాన్ని స్థానిక రైతులు అభినందించారు. మరోవైపు గంజాయి వంటి మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా యువత నేరాల బాట పడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also read

Related posts