June 29, 2024
SGSTV NEWS
CrimeEntertainment

Chandu Death: శిల్పాని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నావ్.. ఎందుకు ఇలా చేశావ్ చందు

టీవీ యాక్టర్‌ చంద్రకాంత్‌ ఆత్మహత్య ఘటన విషాదాన్ని నింపింది. అలాగే రీల్‌ చాటున రియల్‌ లైఫ్‌ను కాటేస్తోన్న లివింగ్‌ రిలేషన్స్‌ పై పబ్లిక్‌ డొమైన్‌లో చర్చ జోరందుకుంది. చందు-పవిత్రల అనుబంధం కూడా అలాంటిదేనా? పవిత్ర లేదని ఇక రాదనే ఆవేదనతో ప్రాణాలను పణంగా పెట్టిన చంద్రకాంత్‌…మూడు ముడుల బంధం గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా?

ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు…. ఎంతలా అంటే ప్రాణానికి ప్రాణంలా… నువ్వు లేక  నేను అనేంతలా….   ఇద్దరికీ నటన అంటే ఇష్టం. నటనే  ఆధారం…టీవీ సీరియల్స్‌లో కలిసి నటించారు…. త్రినయని సీరియస్‌ చేసే సమయంలో మొదలైన చందు-పవిత్రల పరిచయం.. గాఢమైన అనుబంధానికి దారి తీసింది. అలా ఉత్సాహాంగా ఉల్లాసంగా సాగుతోన్న లవ్‌ జర్నీలో అనుకోని కుదుపు.  ఎక్కడో పుట్టి ఎక్కడో ఎదిగి బుల్లితెరపై  తళుక్కున మెరిసిన స్నేహం….ఒక్కసారిగా కనుమరుగైంది.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  పవిత్ర చనిపోవడంతో చంద్రకాంత్‌ గుప్పెడంత గుండె కన్నీరైంది..  పవిత్ర జయరామ్‌  అర్ధాంతర మరణం అందర్నీ దిగ్భ్రాంతి గురిచేసింది. ఐదు రోజులయిందో లేదో   మరో విషాదంతం…. చంద్రకాంత్‌  ఆత్మహత్య సంచలనం రేపింది.

చంద్రకాంత్‌-పవిత్ర ఎన్నో సీరియల్స్‌లో కలిసి నటించారు. రియల్‌ లైఫ్‌లో   వాళ్ల బంధం..అనుబంధం ఏంటి?…..  ప్రేక్షకులను టీవీలకు కట్టడిపడేసే  సీరియల్స్‌ కన్నా… పవిత్ర-చంద్రకాంత్‌ విషాదంతాలు.. వాళ్లిద్దరి  లివింగ్‌ రిలేషన్‌ షిప్‌  నెట్టింట్లో.. నట్టింట్లో చర్చగా మారింది. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సరే.. పెళ్లి చేసుకున్నారా? చేసుకోవాలనుకున్నారా? …. బుల్లితెర చాటున ఓ ట్రెండ్‌గా మారిన సహజజీవనంలో వాళ్లూ ఓ జంట….. ఎన్నో సందర్భాల్లో తమ ప్రేమ గురించి  సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు పోస్ట్‌ చేశారు పవిత్ర

ఒక రాధా- ఒక కృష్ణుడు  అయితే  మరో చర్చ.  చందు పవిత్ర అనుబంధం వెనుక అసలు నిజాలు  వెలుగుచూశాయి. కర్నాటకకు చెందిన పవిత్రకు  దాదాపు పాతికేళ్ల కిందటే పెళ్లయింది. ఇద్దరు ఎదిగిన పిల్లలున్నారు. ఇక చందు కూడా పెళ్లైంది. ఇంట్లో ఇల్లాలు.. ఇంకోవైపు ప్రియురాలు.. ఇద్దరు పిల్లలున్నా ప్రేమవైపే మొగ్గు చూపాడు చందు. భార్య బతిమాలుతున్నా ప్రేయసే కావాలన్నాడు.   చివరి ఆ ప్రేమ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టారు. తననే నమ్ముకున్న భార్యా బిడ్డల్ని  అనాధలను చేశాడు. సంక్షిప్తంగా సీరియల్‌ ఆర్టిస్ట్‌ చందు జీవితం ఇది.

శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చందు. ఆ తర్వాత పవిత్రపై మనసు పారేసుకున్నాడు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కాదని పవిత్ర కోసం తపించాడు..- చివరికి పవిత్ర కోసమే ప్రాణాలను వదిలేశాడు. ఎప్పుడయితే త్రినయనీ  సీరియల్‌లో నటించడం మొదలెట్టాడో అప్పటి నుంచి భార్య శిల్పను దూరం పెడుతూ వచ్చాడు చందు. భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి.  శిల్ప అన్నింటినీ భరించింది. కాని భర్తనుంచి విడిపోడానికి మాత్రం ఒప్పుకోలేదు. తాను విడాకులు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఇద్దరి మధ్యా మాటల్లేవు. చనిపోయే ముందు రోజు కూడా తనతో మాట్లాడలేదని.. అయినాగాని వంట చేసి పెట్టానన్నారు చంద్రకాంత్‌ భార్య శిల్ప

నిజానికి త్రినయని సీరియల్‌ వల్లనే ఇద్దరు కలిశారు. అప్పుడు సిస్టర్‌-బ్రదర్‌ క్యారెక్టర్‌ చేసిన ఇద్దరూ కలిసి రీల్స్‌ చేసేవారన్నారు. మొదట్లో తనకు అనుమానం రాలేదని.. వారి రిలేషన్‌ బయటపడేసరికి పరిస్థితి చేయిదాటిపోయిందన్నారు శిల్ప.  ఇద్దరి గురించి తెలిసి.. వారి రిలేషప్‌పై నిలదీశానన్నారు శిల్ప. తమ బంధాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారన్నారు.  తన భర్త చావుకు కారణం పవిత్రే అన్నారు శిల్ప. ఆమె చనిపోయిందన్న డిప్రెషన్‌లో సూసైడ్‌ చేసుకున్నాడని చెప్పారు.

స్నేహం..ప్రేమ..ఆపై సహజీవనం.. ఇదీ తెర చాటున కొత్త ట్రెండ్‌.  పెళ్లయినా సరే ప్రేమ పేరిట మరొకరితో సహజీవనం… సీరియల్స్‌లోనే కాదు రియల్‌గా కూడా అదే జరుగుతోంది. అదే అనర్ధాలకు  కారణమవుతోంది.  అడల్ట్రీ వల్ల తనలాంటి ఎందరో బాధింపబడుతున్నారన్నారు చందు భార్య శిల్ప. ఎంతోమంది కుటుంబాల్లో చిచ్చుపెడుతోందన్నారు. ఒకసారి తనలాంటి వారి బాధను కూడా అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు.  చనిపోయే ముందురోజు ఇక తాను బతకనని చెప్పాడన్నారు చందు తండ్రి. పవిత్ర జయరాం దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడని.. ఎంత బతిమిలాడినా.. పెద్దలతో మాట్లాడించినా చివరకు చేయాలనుకున్నది చేశాడన్నారు అతడి తండ్రి.

చంద్రకాంత్‌ మరణాన్ని వారి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన డిప్రెషన్‌తోనే చనిపోయాడని ఆవేదనతో చెబుతున్నారు. కొన్నిరోజులు ఆగితే అన్నీ కుదుటపడతాయని చెప్పినా వినలేదని వాపోతున్నారు.  చందు చనిపోయిన విషయం తెలుసుకుని అతడి ఇంటికి భారీగా చేరుకున్నారు తోటి ఆర్టిస్టులు, స్నేహితులు. కుంగిపోవద్దని.. తామంతా ఉన్నామని చెప్పామన్నారు

జగమంత కుటుంబం నాది  అన్నట్టుగా అందరితో  కలిసి మెలిసివుండేవాడు.. సొంత మనిషిలా కలిసిపోయేవాడు..ఇది చందు గురించి  స్నేహితులు చెప్తున్న మాట.  కానీ అన్ని తెలిసిన వ్యక్తయి వుండి…ఆత్మహత్యకు పాల్పడ్డం..అదీ తన భార్యాబిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచించకపోవడం  అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

Also read

Related posts

Share via