పెళ్లకూరు, : తెదేపాకు ఓట్లేశారని ఓ కుటుంబంపై కక్ష పెంచుకున్న ఎన్డీసీసీబీ మాజీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. హత్యాయత్నానికి తలపడ్డారు. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరుకు చెందిన వైకాపా నేత రాకేష్రెడ్డి… ఎన్నికలకు ముందు సత్యనారాయణరెడ్డి అరాచకాలపై ప్రశ్నించారు. అప్పట్లో రాకేష్రెడ్డిని సత్యనారాయణరెడ్డి రోడ్డుపై కట్టేసి కొట్టారు. ఆ తర్వాతి నుంచి రాకేష్రెడ్డి కుటుంబం తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సత్యనారాయణరెడ్డి భావిస్తున్నారు. గురువారం రాత్రి కరెంటు తీసేసి రాకేష్రెడ్డి, ఆయన తండ్రి విజయసేనారెడ్డిపై హత్యాయత్నం చేశారు.

సత్యనారాయణరెడ్డి అనుచరులు రాడ్లు, కర్రలతో దాడిచేశారు. రక్తపు మడుగులో ఉన్న వారిని స్థానికులు రక్షించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులపైనా దాడిచేయడంతో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైంది.

డీఎస్పీ, సీఐలతో వాగ్వాదం
విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, సీఐ జగన్మోహన్రావు ఘటనాస్థలానికి చేరుకోగా వారిపైనా అల్లరిమూకలు గొడవకు దిగాయి. అక్కడే ఉన్న సత్యనారాయణరెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన వ్యవహారంతో విసుగు చెందిన పోలీసులు పెళ్లకూరు ఠాణాకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య… ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు ఎలా పెడతారంటూ పోలీసులను ప్రశ్నించి, వాదనకు దిగారు.
పదిమంది అరెస్టు
హత్యాయత్నం కేసులో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏ1గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని, హత్యాయత్నంలో పాల్గొన్న మరో 9 మందిని అరెస్టుచేసి, సూళ్లూరుపేట కోర్టుకు తరలించారు. ఘటనపై అదనపు ఎస్పీ కులశేఖర్ విచారణ చేపట్టారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు





