పశ్చిమగోదావరి: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త మృత్యువాత పడగా, కుమారుడు కత్తిపోటు గాయానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన గుల్లంకి వెంకట్ (44), ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్వతికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే పది ఏళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వెంకట్ తన స్వగ్రామం తాడేపల్లిగూడెంలో ఉంటుండగా, పార్వతి తన ఇద్దరు పిల్లలతో ఉండ్రాజవరంలో ఉంటోంది.
వెంకట్ అప్పుడప్పుడూ వచ్చి పార్వతిని తనతో వచ్చేయమని గొడవ పడుతుండేవాడు. ఇటీవల కుమార్తె పెళ్లి కారణంగా వచ్చిన వెంకట్ పది రోజుల నుంచి ఉండ్రాజవరంలోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పార్వతిని తనతో వచ్చేయాలంటూ మళ్లీ గొడవకు దిగాడు. దీంతో భార్య పార్వతి, కొడుకు కృష్ణవంశీతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కృష్ణవంశీని వెంకట్ కత్తితో పొడిచాడు. కొడుకు కత్తిపోటుకు గురికావడంతో చలించిన పార్వతి ఒక్కసారిగా భర్తపై ఇటుకతో దాడికి పాల్పడింది.
వెంకట్ దాడిని ప్రతిఘటించే క్రమంలో తల్లీకొడుకు ఇద్దరూ కలిసి ఇటుకలతో వెంకట్ తలపై కొట్టడంతో వెంకట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తేరుకున్న పార్వతి గాయపడిన భర్త, కొడుకును తణుకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వెంకట్ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు నుంచి ఏలూరు, అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. గురువారం తెల్లవారుజామున వెంకట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొడుకు కృష్ణవంశీ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉండ్రాజవరం ఎస్సై వి.అప్పలరాజు కేసు నమోదు చేయగా, నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..
- రెండేళ్ల తర్వాత పగ.. పక్కా స్కెచ్తో ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి
- తండ్రిని ఆటో ఎక్కించాడు.. బైక్పై ఇంటికి బయల్దేరగా.. ఇంతలో.!
- పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందంటే?
- మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!





