SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు


చిత్తూరు జిల్లా గంటావూరు కాలనీ గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టాడు. ఈ చిల్లర చేష్టల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP News: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలోని గంటావూరు కాలనీలో నిర్వహించిన గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడికొచ్చిన భక్తులను, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. జాతర సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా కొంతమంది యువకులు వినోదానికి గానీ వేషధారణలు చేసుకుంటూ పాల్గొన్నారు. అందులో ఒక యువకుడు మాతంగి రూపంలో స్త్రీ వేషం ధరించి జాతరలో పాల్గొన్నాడు. ఈ సమయంలో దర్శనానికి వచ్చిన ఒక యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టడంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.

చిల్లర చేష్టలకు పెద్ద ఎత్తున విమర్శలు:
ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక కొంతమంది ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. బలవంతంగా తాళి కట్టాడేమోనని అనుమానంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే తరువాత విషయం వెలుగులోకి వచ్చిందాకా అందరినీ అసమాధానానికి గురిచేసింది. ఆ యువతి, తాళి కట్టిన యువకుడు ఇద్దరూ పరస్పరం స్నేహితులు అని, ఇది తమ మధ్య మోజుగా జరిగిన పని మాత్రమేనని తెలిసి కొంతవరకూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిల్లర చేష్టలు, తాలూకు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు ఆగ్రహంతో మాట్లాడుతూ పవిత్రమైన తాళిని ఇలా ఆటవికంగా, వినోదంగా చూసే వీరు సామాజిక విలువలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. గంగమ్మ జాతర వంటి పవిత్రమైన ఉత్సవాల్లో ఇలాంటి చర్యలు అనుచితమని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని కొందరు పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన జాతరలు, ఉత్సవాలలో యువత ప్రవర్తనపై కొత్తగా చర్చకు దారి తీసింది. సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. ఆనందం, ఉల్లాసం పేరుతో అపహాస్యం చేయడమంటే సాంస్కృతిక విలువలను తక్కువ చేయడమే. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి కొందరూ అంటున్నారు.

Also read

Related posts

Share this