SGSTV NEWS
Andhra PradeshCrime

YS వివేకా హత్య కేసు: రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి



ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. సాక్షులు ఒకొక్కరుగా చనిపోతుండటంపై కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కేబినెట్‌లోనూ వివేకా హత్యకేసుపై ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు ప్రధాన సాక్షి రంగన్న మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. పొలిటికల్‌గానూ కాకరేపుతోంది.


వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు మళ్లీ తెరపైకొచ్చింది. ప్రధాన సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న చనిపోవడంతో… మర్డర్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఒక్క రంగన్న మాత్రమే కాదు సాక్షులుగా ఉన్న మరో ఐదుగురు ఆయన కంటే ముందే చనిపోవడంతో కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరణాల మిస్టరీని తేల్చాల్సిందేనంటున్నారు. అందులోభాగంగానే రంగన్న మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిట్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో… తిరుపతి, కడప వైద్యులు రీ-పోస్ట్‌మార్టం చేసి శాంపుల్స్ ల్యాబ్‌కు పంపారు.


వివేకా హత్యకేసుపై శుక్రవారం కేబినెట్‌లో కూడా చర్చ జరిగింది. సుమారు గంటపాటు చర్చించారు. వివేకా హత్యకేసులో సాక్షులు ఒకొక్కరుగా చనిపోవడంపై మంత్రివర్గం ఆరా తీయడంతోపాటు…. డీజీపీ వివరణ కోరింది. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే హోంమంత్రి అనిత సైతం రంగన్న మృతిపై అన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. తప్పు చేసిన వారు ఎట్టిపరిస్థితిలో శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు.


వివేకా హత్య కేసు విషయంలో ప్రభుత్వ తీరుపై ఇటు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసుతో జగన్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే వివేకా హత్య కేసును తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఏపీలో చర్చించేందుకు సమస్యలే లేనట్లు కేబినెట్‌లో వివేకా మర్డర్‌ కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంపై మండిపడ్డారు. మొత్తంగా…ఓవైపు సాక్షుల వరుస మరణాలపై ఎంక్వైరీ… మరోవైపు పొలిటికల్‌ విసుర్లతో వివేకా హత్యకేసు మళ్లీ హీటెక్కింది

Also read

Related posts

Share this