పెళ్లి వయస్సు దాటిపోతుంది. అసలే సంబంధాలు రావటం లేదు. ఇక చేసేది లేక బ్రోకర్లను ఆశ్రయించాడు ఆ పెళ్ళికొడుకు. కానీ అదే అతని కొంప ముంచింది. ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు పెళ్ళాం అద్దెకు వచ్చింది. వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్న అదే నిజం. డబ్బుకు కక్కుర్తి పడి బ్రోకర్లు ఆడిన ఆటలో బలిపశువయ్యాడు ఆ పెళ్ళికొడుకు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ మహిళ 10 వేలకు ఆశ పడి వాళ్ళతో చేతులు కలిపింది. పెళ్ళి చేసుకున్నాక పారిపోదాం అనుకుంది కానీ అవకాశం లేకపోవటంతో.. ఐదేళ్ళ కొడుకు కోసం అసలు విషయం బయట పెట్టింది. దాంతో కంగుతిన్న ఆ నవ వరుడు పెళ్లైన నాలుగు రోజులకే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
అతని పేరు దుర్గాప్రసాద్. కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన ఈయనకు పెళ్లి వయసు వయసు దాటిపోతుంది. చుట్టాల్లోనూ, చుట్టుపక్కల ఎక్కడా సంబంధాలు కుదరట్లేదు.. కొంతమంది అమ్మాయిలు ఇతనికి నచ్చలేదు.. కొందరు అమ్మాయిలే ఇతడ్ని రిజెక్ట్ చేశారు. దాంతో సంబంధం చూడమని రాయచూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళకు చెప్పాడు. ఆమె రాజమహేంద్రవరానికి చెందిన తాయారు అనే మహిళా పెళ్లిళ్ల బ్రోకర్కు విషయం చేరవేసింది. అక్కడి నుండి మళ్లీ విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ముఖర్జీకి తాయారు విషయం చెప్పింది. ఇలా ఎక్కడో మొదలైన ప్రయాణం కాస్త విజయవాడ వచ్చి ఆగింది. ముఖర్జీ ఆటోడ్రైవర్గా పని చేస్తూనే పెళ్లిళ్ల బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు. అతను తనకు పరిచయం ఉన్న విజయవాడ వాంబే కాలనీ చెందినటువంటి మరో ఇద్దరు మహిళలకు సబంధం గురించి చెప్పాడు. ఇలా ఒకరు నుంచి.. మరొకరికి పాకుతూ విజయవాడ వచ్చి చేరిన ఈ పెళ్లి సంబంధం కాస్త బ్రోకర్ల అత్యాశకు చిక్కింది.
అంతే ఇంకేముంది పక్క రాష్ట్రానికి చెందిన సంబంధం మోసం చేసినా దొరకం అనుకున్నారేమో కానీ పెద్ద స్కెచ్ వేశారు. ఈ మధ్యకాలంలో మ్యాట్రీమోనీ లాంటి ఆన్లైన్ యాప్స్లో జరుగుతున్న మోసాలను మించిపోయిన ఈ మోసం.. పెళ్ళికొడుకు విజయవాడ వచ్చి పోలీసులు ఆశ్రయించడంతో బయటపడింది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్న ఈ బ్రోకర్లు అంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు. ఆమెకు కొన్నాళ్ల క్రితం పెళ్ళై భర్త ఎటో వెళ్లిపోవడంతో ఐదేళ్ల కుమారుడుతో ఒంటరిగా ఉంటుంది. ఆమెకు డబ్బు ఆశ చూపించిన ఈ బ్రోకర్లు పెళ్లి కూతురిలా తయారు చేశారు. పెళ్లి చేస్తాం.. కొన్ని రోజులు కాపురం చేసి పారిపోయి వచ్చేయమని సూచించారు. పక్క రాష్ట్రం కదా దొరకవు అని రోజుకు పదివేలు చొప్పిన 5 రోజులకు 50 వేలు ఇస్తామని చెప్పి ఆమెను ఒప్పించారు. ఈనెల 5వ తేదీన పెళ్లి చేసి ఆమెని ఆయన వెంట కర్ణాటక పంపించారు. ఆ రోజు పెళ్లి ఖర్చులకు అంటూ 50 వేలు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి కుదిర్చినందుకు మూడు లక్షల 50 వేలు బ్రోకర్లు తీసేసుకున్నారు.. కాపురానికి వెళ్ళాక.. భార్య భర్తను ముట్టుకోనివ్వడం లేదు. పైగా పుట్టింటికి రావడానికి ఆమని అదేపనిగా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతిసారి ఆమె ఇంటికి వెళ్తానని అడగడం.. భర్త నేను కూడా తోడు వస్తానని చెప్తూ ఉండటంతో… ఏం చేయాలో తెలియక కొడుకు కోసం అసలు విషయాన్ని ఆమని చెప్పేసింది. దాంతో దుర్గాప్రసాద్ విజయవాడ వచ్చి మధ్యవర్తులను నిలదీశాడు. వాళ్లు మోసాన్ని అంగీకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు
Also read
- నేటి జాతకములు 17 జూన్, 2025
- పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
- Telangana: గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుడిసె వేసిన రోజు కూలీ – ఆవేదనలో అర్థం ఉందండోయ్
- Telangana: ఆలయ సమీపంలోని లింగానికి పూజలు – కాస్త పక్కన చూడగా..
- హత్రాస్లో దారుణం.. తల్లితో స్కూటీపై వెళ్తున్న యువతిని కాల్చి చంపిన దుండగులు..