బంగారం పేరుతో గ్రామమంతా మోసపోయింది. నెలకు మూడు వేలే కట్టండి, పది నెలల తర్వాత ఎనిమిది గ్రాముల బంగారం పొందండి అంటూ పెట్టిన స్కీమ్… చివరికి వందల మందిని రోడ్డున పడేసింది. పెనుగంచిప్రోలు గ్రామం మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే, స్కీమ్ పెట్టిన చిన్నం దుర్గారావు మాత్రం బంగారం రేటు పెరుగుదలతో మాయం అయ్యాడు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో బంగారం పేరుతో వందల మందిని మోసం చేసిన గోల్డ్ స్కీమ్ కుంభకోణం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ‘నెలకు మూడు వేలే కట్టండి… పది నెలల తర్వాత ఎనిమిది గ్రాముల బంగారం పొందండి’ అంటూ ఆకట్టుకునే ఆఫర్తో చిన్నం దుర్గారావు అనే వ్యక్తి గ్రామంలో గోల్డ్ స్కీమ్ మొదలుపెట్టాడు. గ్రామస్తులు కూడా పెద్దగా ఆలోచించలేదు. నెలకు మూడు వేలేగా… దాచుకున్నట్టే కదా అనుకుంటూ బంగారం ఆశతో బోలెడు మంది డబ్బులు పెట్టేశారు.
ముప్పై ఏళ్లుగా గ్రామంలో ఉంటూ అందరి విశ్వాసం గెలుచుకున్న దుర్గారావు, మొదట కొన్ని నెలలు స్కీమ్ సవ్యంగా నడిపి అందరి నమ్మకాన్ని పొందాడు. కానీ బంగారం రేటు రోజురోజుకీ పెరగడంతో పరిస్థితి తారుమారైంది. పది గ్రాముల బంగారం అరవై వేలు ఉన్నప్పుడు మొదలైన స్కీమ్, ఇప్పుడు తులం లక్ష ఇరవై వేలకు చేరుకోవడంతో దుర్గారావుకు గోల్డ్ ఇవ్వడం సాధ్యమే కాదు. డబ్బులు ఇవ్వలేక, బంగారం ఇవ్వలేక దుర్గారావు ఊరిని వదిలి పరారయ్యాడు. చిన్నగా మొదలైన ఆ గోల్డ్ స్కీమ్, ఇప్పుడు కోట్ల రూపాయల మోసంగా మారింది. గ్రామస్తులు తమ కష్టార్జిత డబ్బులు పోయాయని, బంగారం కలలన్నీ చిద్రమయ్యాయని వాపోతున్నారు.
పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 70 మందికి పైగా బాధితులు ఫిర్యాదులు ఇచ్చారు. కొందరు అయితే దుర్గారావు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లతో కోర్టును ఆశ్రయించారు. కష్టపడి రూపాయి రూపాయిగా దాచుకున్నాం. ఇప్పుడు అంతా గాల్లో కలిసిపోయింది అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒత్తిడి పెరగడంతో దుర్గారావు పది రోజుల తర్వాత జగ్గయ్యపేట సర్కిల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





