క్షణికావేశాలు నిండు ప్రాణాలు బలికుంటున్నాయి. చిన్న చిన్న కారణాలు ఊపిరి తీసేస్తున్నాయి. కొందరు ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే.. మరి కొంతమంది హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో అన్నదమ్ముల మధ్య మొదలైన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. నాటు తుపాకీతో అన్నను హత్య చేశాడు తమ్ముడు. ఆవు దూడ కోసం ఈ హత్య జరిగిందని తెలుసుకొని పోలీసులే అవాక్కయ్యారు.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామం. అక్కడ గ్రామ దేవత పండగ ఘనంగా జరుగుతుంది. బొడ్డువారి కుటుంబీకులు ఒడ్డు పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరితోపాటు అన్నదమ్ములైన జోగ రాము, జోగ దేముళ్లు మద్యం సేవించారు. సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆవు దూడ.. తన తల్లి దగ్గర పాలు తాగుతోంది. దాన్ని తమ్ముడు దేముళ్లు దానిని సరదాగా అదిలించాడు. దీంతో అన్న రాము ఆగ్రహంతో తమ్ముని ప్రశ్నించాడు. ఆవు పెయ్యిని ఎందుకు అదిలించావంటూ దేముళ్ళు ను అన్న రాము మందలించాడు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహంతో ఊగిపోయిన దేముళ్లు.. తన వద్ద వున్న నాటు తుపాకీని రాముపై ఎక్కువ పెట్టాడు. అప్రమత్తం అయ్యేలోపే కాల్పులు జరిపాడు. నాటు తుపాకీ గుండు రాము శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రాము. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చోడవరంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న కె.కోటపాడు సీఐ పైడంనాయుడు, ఇన్చార్జి ఎస్ఐ నారాయణరావు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు. పలువురుని విచారించారు. రాము మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు దేముళ్లు పరారీలో ఉన్నాడు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





