March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: చోరీ చేసిన సొత్తు ఎక్కడ అంటే.. ఓ చోట గోతాల్లో ఉన్నాయన్నారు.. వెళ్లి చెక్ చేయగా..



పగలంతా పాములతో ఆటాడుతారు… రాత్రయితే తమ రెండో జాబ్‌లోకి దిగిపోతారు. అయితే ఈ సారి వారి పాపం పండింది. పోలీసులకు చిక్కారు. అయితే తమ పనులతో పోలీసులను కూడా భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. దీంతో తొలుత వెనుకడుగు వేసిన పోలీసులు తర్వాత తమదైన శైలిలో నిందితులను దారిలో తెచ్చుకున్నారు.


వాళ్లు పాములు ఆడిస్తూ.. పదో, పరకో ఇస్తే తీసుకుని వెళ్లిపోతుంటారు. అయితే ఇది వారి పార్ట్ టైమ్ జాబ్. అసలు జాబ్ వేరే ఉంది. అది ఏంటి అంటే దొంగతనాలు. అవును.. పగలు వచ్చినప్పుడు మంచి ఇళ్లు సెలక్ట్ చేసుకుని.. రాత్రయితే వచ్చి వాలిపోతూ ఉంటారు. ఇలా దొంగతనాలకు తెగబడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అనంతపూరం జిల్లా కణేకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి  రూ.10.05 లక్షల క్యాష్ రికవరీ చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామస్థులు టెంపుల్ నిర్మాణం కోసం చందాల తీసుకుని…  12 లక్షల రుపాయలను పోగు చేశారు. ఆ డబ్బును అదే గ్రామానికి చెందిన పెద్ద మనిషి గుర్రం లక్ష్మన్న దగ్గర వద్ద ఉంచారు. అతడు డబ్బును ఇంట్లో ఉంచి మార్చి 3న పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. ఈ క్రమంలోనే దొంగలు లక్ష్మన్న ఇంటి తలుపులు బద్దలుకొట్టి.. బీరువాలో దాచిన నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు మరుసటిరోజు కణేకల్లు పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే యాక్షన్‌లోకి దిగిన పోలీసులు.. చోరీ చేసిన సొమ్ముతో నిందితులు ఉడాయిస్తుండగా వారిని అరెస్టు చేశారు. నిందితుపై ఏపీలోనే కాక కర్ణాటక, తమిళనాడుల్లో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.

కడప ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన జానయ్య, గురునాథం రాజులు చుట్టాలవుతారు. వీరు పాముల్ని పట్టి గ్రామాల్లో ఆడించి పొట్టు పోసుకుంటూ ఉంటారు. వీరిద్దరు కొంతకాలం తమిళనాడులోని ఓ గ్రామంలో బాతులు మేపుతూ జీవనం సాగించారు. ఈ సమయంలో అక్కడ దండపాణి కార్తిక్‌ అనే వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. అనంతరం ముగ్గురూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు. వారు ఈనెల ప్రారంభంలో కర్ణాటక నుంచి బెళుగుప్ప మండలం జీడిపల్లి (డ్యాం) గ్రామానికి వచ్చారు. ఈనెల 3న కణేకల్లు వైపు వెళ్తుండగా సొల్లాపురం గ్రామంలో ఓ ఇంటికి తాళాలు వేసి ఉండటం చూసి.. చోరీకి స్కెచ్ వేశారు. రాత్రి రంగంలోకి పని పూర్తి చేశారు.  డబ్బుతో ఇద్దరు నిందితులు కర్ణాటకలోని పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. పరారిలో ఉన్న మరో నిందితుడు జానయ్య కోసం గాలిస్తున్నారు.


నిందితుల్ని విచారించిన పోలీసులు..  నగదు దాచి పెట్టిన ప్రాంతానికి వెళ్లి  స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే దొంగలు చోరి చేసిన నోట్ల కట్టలను తాచుపాములు ఉంచిన సంచుల్లో పడేశారు. ఆ డబ్బులు ఉన్న సంచులను తెరిచి చూడగా పోలీసులపై పాములు పడగవిప్పి బుసలు కొట్టాయి. దీంతో తొలుత కాస్త వెనక్కి తగ్గిన పోలీసులు.. ఆపై చాకచ్యంగా సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Also read

Related posts

Share via