July 5, 2024
SGSTV NEWS
Andhra Pradesh

నడి సంద్రం.. బోటులో అగ్ని ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన కోస్ట్ గార్డ్..!

వాళ్ళంతా మత్స్యకారులు.. తొమ్మిది మంది కాకినాడ తీరం నుంచి మర బోటులో చేపల వేటకు బయలుదేరారు. పదిరోజులు గడిచాయి. వేట సాఫిగా సాగుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా బోటులో భారీ శబ్దం.. తెరుకునే లోగా భారీ మంటలు..! అందరూ మంటల్లో చిక్కుకున్నారు. నడి సంద్రం.. పైన ఆకాశం, కింద నీరు.. చుట్టూ కనుచుపుమేర ఎవరూ లేరు. మంటల్లో చిక్కుకున్న వాళ్ళు హాహా కారాలు చేస్తున్నారు. అప్పటికే అందరికి కాలిన గాయ్యాలయ్యాయి. ఇంతలో కోస్ట్ గార్డ్ కు సమాచారం అందింది. స్పాట్ కు చేరుకుని ప్రాణాలకు తెగించి, రెస్క్యూ చేసి తొమ్మిది మంది సురక్షితంగా కాపాడారు.



సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో జనరేటర్ వద్ద మంటలు చెలరేగాయి. క్షణాల్లో మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయి. విశాఖ తీరానికి నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా కాకినాడ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్.. డీఐజీ రాజష్ మిట్టల్ పర్యవేక్షణలో వీర నౌకలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రెస్క్యూ చేశారు. గాయపడ్డ వారిని కోస్ట్ గార్డ్ నౌక సిజిఎస్ వీరలో విశాఖకు తరలించారు. అక్కడ నుంచి మూడు అంబులెన్స్‌ల్లో విశాఖ కేజీహెచ్‌కు తరలించామని కోస్ట్ గార్డ్ అధికారి ప్రకాష్ తెలిపారు.

ఏటిమొగ్గ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది మత్య్సకారులు కాకినాడ తీరం నుంచి శ్రీ దుర్గా భవాని అనే బోటులో మార్చి 26న వేటకు బయలుదేరారు. ఏప్రిల్ 14న తిరిగి చేరాల్సి ఉంది. అయితే, ఏఫ్రిల్ 5, శుక్రవారం రోజున డీప్ సీ లో వేట చేస్తుండగా.. జనరేటర్ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. గాలి తీవ్రత అధికంగా ఉండడంతో క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆర్ సత్తిబాబు (40), ధర్మారావు (42), వజ్రం(40), వై సత్తిబాబు(42), దండుపల్లి శ్రీను (45), ఎం భైరవ (50), గంగాద్రి (38), వీరబాబు (20), ఎస్ సత్తిబాబు (45) గాయపడ్డారు. వీరిలో ఆర్ సత్తిబాబు, ధర్మారావు పరిస్థితి విషమంగా ఉంది. మిగిలి వారు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారందరికీ విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు

Also read

Related posts

Share via