తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చికెన్ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితులు విశాఖలో పట్టుబడ్డారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో కోల్కతా పారిపోతుండగా విశాఖ జీఆర్పీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కుర్బాన్ సహా ఇద్దరూ నిందితులను పట్టుకున్నారు.
అసలేం జరిగింది..!
సిద్ధిపేట జిల్లా తుప్రాన్ మండలం వెంకటాపూర్లో చికెన్ వ్యాపారి మహిపాల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య చేసి దుప్పట్లో మృతదేహం చుట్టి 18వేల నగదుతో పారిపోయారు నిందితులు. అయితే, మహిపాల్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అతని కోసం ఆరా తీశారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చింది. షాప్ వరకు వెళ్లి చూశారు. ఎవరూ లేరు షటర్ పైకి ఎత్తి చూశారు. దీంతో లోపల దుప్పట్లో మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రాష్ట్రాల పోలీసులకు అలర్ట్ చేశారు.
నిందితులు పరారీతో..
చికెన్ షాపులో పనిచేసే ఇద్దరు వర్కర్లు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరికి షాపులోని వర్కర్లే నిందితులుగా తేలారు. సిద్దిపేట పోలీసుల ఇన్ఫర్మేషన్ తో అప్రమత్తమైన విశాఖ గవర్నమెంట్ రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో రైళ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే 18046 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ పైనా నిఘా పెట్టి తనిఖీలు చేశారు. ట్రైన్ జనరల్ బోగీలో దాక్కుని అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వాళ్లే నిందితులుగా తేలారు. కుర్బాన్ అలీ సహా ఇద్దరిని జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులకు సమాచారం అందించి నిందితులను వాళ్లకు అప్పగించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన సిద్దిపేట పోలీసులు.. ట్రాన్సిట్ వారెంట్ పై నిందితులను సిద్దిపేటకు తరలించారు.
అందు కోసమే హత్య..
నిందితులను అప్పగింతలో చొరవ చూపిన విశాఖ జీఆర్పీ సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అభినందించారు. ఘటనాస్థలం నుంచి బస్సులో సికింద్రాబాద్ వరకు చేరుకున్న నిందితులు.. అక్కడ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో కోల్కతాకు పారిపోతున్నట్టు గుర్తించారు. నగదు కోసమే హత్య చేసినట్టు నిర్ధారించారు. నిందితుల నుంచి కొంత నగదు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
Also read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





