SGSTV NEWS online
Andhra PradeshCrime

ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..



ఒకవైపు ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. మరొకవైపు కళ్ల ముందే ముంచెత్తిన రాక్షస అలలు.. స్నేహితురాలిని కాపాడేందుకు సముద్రంలోకి దూకిన ఒక మిత్రుడి ధైర్యం.. ఎన్నో జ్ఞాపకాలను విషాదంగా మార్చేసింది. గంగవరం తీరంలో అలల ధాటికి గల్లంతైన రాము, నీతుల కోసం రెస్క్యూ కొనసాగుతుంది. ఇంకా వారీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.


ఫ్రెండ్షిప్‌ని ఆనందంగా జరుపుకుందామని వచ్చిన ఆ యువతీ యువకుల సరదా కొద్దిసేపట్లోనే తీరని శోకంగా మారింది. విశాఖపట్నం పెదగంట్యాడ మండలం పరిధిలోని పాత గంగవరం బీచ్‌లో సముద్రపు అలల ధాటికి ఇద్దరు స్నేహితులు గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గల్లంతైన వారిని రాము, నీతుగా గుర్తించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఏడుగురు ఫ్రెండ్స్ ఆటోలో సరదాగా గడిపేందుకు గంగవరం బీచ్‌కు వచ్చారు. బీచ్‌కు సమీపంలో ఉన్న గుడిని దర్శించుకున్న అనంతరం అందరూ కలసి తీరానికి వెళ్లారు. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు సముద్ర తీరంలో ఉన్న రాళ్ల గుట్టపైకి ఎక్కారు. సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన భారీ అల రాళ్లను బలంగా తాకడంతో ప్రమాదవశాత్తు నీతు సముద్రంలో పడిపోయింది.


కాపాడబోయి మరొకరు..
కళ్లముందే నీతు అలల తాకిడికి కొట్టుకుపోవడం చూసి, ఆమెను రక్షించేందుకు రాము వెంటనే సముద్రంలోకి దూకాడు. అయితే సముద్రంలో ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. రాళ్లపై ఉన్న మిగతా స్నేహితులు ప్రమాదాన్ని గ్రహించి కేకలు వేయడంతో స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి మిగిలిన వారిని సురక్షితంగా రక్షించారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం వరకు నేవీ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్, నిపుణులైన గజఈతగాళ్ల సహాయంతో తీవ్రంగా గాలించినప్పటికీ చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. సొమవారం ఉదయం నుంచే రెస్క్యూ సిబ్బంది, పోలీసులు మళ్లీ రంగంలోకి దిగి డ్రోన్లు, బోట్ల సహాయంతో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. తీరం వెంబడి గాలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు రాము, నీతు ఆచూకీ లభించలేదు.


కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
పండగలా జరుపుకోవాల్సిన ఫ్రెండ్‌షిప్ డే రోజే ఇలాంటి తీవ్ర విషాదం జరగడంతో బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. బీచ్ వద్దే ఉంటూ తమ బిడ్డల ఆచూకీ కోసం గజఈతగాళ్లు, పోలీసుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also read

Related posts