Astrological Significance and Lakshmi Pooja: తెల్లవారితే(ఆదివారం) జ్యేష్ఠ పౌర్ణమి. ఈ రోజున చంద్రుడు మూల నక్షత్రంలో గురు రాశిలో ఉండటం శుభయోగాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పౌర్ణమి రోజున విశేష పూజలు చేయడం వల్ల దరిద్ర బాధలు తొలగి, మానసిక, శారీరక, బుద్ధిపరమైన రక్షణ లభిస్తుంది.
‘ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీహి ప్రచోదయాత్. ఓం వసుంధరాయే నమః, వసుంధర లక్ష్మీ దేవతాయే నమః’.. ఈ పవిత్ర మంత్రాలతో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ, మనకి దగ్గరలో రాబోయే విశేషమైన జ్యేష్ఠ పౌర్ణమి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ జ్యేష్ఠ పౌర్ణమి జూన్ మాసంలో వస్తుంది, ఇది జ్యేష్ఠా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమి. అయితే, జ్యేష్ఠా నక్షత్రం వెళ్లి మూల నక్షత్రం ఆవిర్భవిస్తుంది. మూల నక్షత్రం గురువు రాశిలో ఉంటుంది కాబట్టి, చంద్రుడు మూల నక్షత్రంలో, గురువు రాశిలో ఉంటాడు. ఇది జ్యేష్ఠ పౌర్ణమి ప్రధాన విశేషం.
జ్యోతిష్యపరంగా ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చంద్రుడి ఇంట్లో గురువు, గురువు ఇంట్లో చంద్రుడు ఉండే రాశి పరివర్తనం ఈ సమయంలో ఏర్పడుతుంది. ఈ గ్రహస్థితి అందరికీ శుభయోగాలను ప్రసాదిస్తుందని నమ్మకం. చంద్రుడు షోడశ కళలతో వృద్ధి చెంది, తన కిరణాలను భూమి మీద ప్రసరింపజేస్తాడు. పంచభూతాలలో సముద్రుడి మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. భూమిలో 70-80 శాతం నీటితో నిండి ఉంది కాబట్టి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చంద్రుని ప్రభావం సముద్రాలపై విశేషంగా ఉంటుంది.
ఆ సముద్రాలు నిండి ఉన్న భూమి మీద నివసించే మన మీద కూడా ఈ రోజున చంద్రకిరణాలు విశేషంగా ప్రసరిస్తాయి. ఈ కిరణాలు శుభాలను, ఆనందాలను, వికాసాలను, చైతన్యాన్ని కలుగజేస్తాయి. ఆత్మ చైతన్యానికి, ఆత్మ నిగ్రహానికి, సంకల్ప వికాసానికి సూర్యభగవానుడి కిరణాలు చంద్రుడి మీద పడి, ఆ సమ్మిళితమైన కిరణాలు మనపై పడతాయి. చంద్రుడు, సూర్యుడు మనకు తల్లిదండ్రులతో సమానం. వారి ఆశీర్వచనం రూపంలో ఈ కిరణాలు మనకు అందుతాయి.
ఈ పౌర్ణమి రోజున జ్యేష్ఠా దేవి గురించి కూడా గుర్తుంచుకోవాలి. జ్యేష్ఠా దేవి లక్ష్మీదేవి అక్కగారు. ఈమె శని భార్య. జ్యేష్ఠా దేవిని దరిద్ర దేవతగా భావిస్తారు. మన జీవితంలో ఎన్నో దరిద్ర బాధలను అనుభవిస్తూ ఉంటాం. అవి ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా, విద్యార్థులైతే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, కక్ష, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహాలు వంటి మానసిక సమస్యల రూపంలో ఉంటాయి. ఇవి మన శరీరం లోపల జరిగే వింతవింత ఆలోచనలు, మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయి.
కాబట్టి, మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా రక్షణ పొందడానికి, జ్యేష్ఠా దేవి ఆగ్రహాన్ని పొందకుండా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున నిండు మనసుతో లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అందుకనే, లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా అన్ని రకాల దరిద్ర బాధల నుండి విముక్తి పొంది, సుఖ సంతోషాలతో జీవించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?
ఈ రోజున, పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా మీ స్నానపు నీటిలో గంగాజలం కలుపుకుని ఇంట్లోనే స్నానం చేయండి. పేదలకు, అవసరమైన వారికి ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయండి. తామసిక ఆహారాలను తినడం మానుకోండి. చంద్రోదయం సమయంలో చంద్రుడిని పూజించి, దానికి ప్రార్థనలు చేయండి.
దృక్ పంచాంగం ప్రకారం, పౌర్ణమి ప్రారంభంతో పాటు జూన్ 29వ తేదీన ఉదయం 3:06 గంటలకు భద్రాకాలం మొదలవుతుంది. భద్రాకాలం రేపు సాయంత్రం 4:16 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో గృహప్రవేశాలు, తలనీలాలు సమర్పించే కార్యక్రమాలు లేదా కొత్త పనులను చేపట్టడం వంటివి చేయవద్దు. అయితే, జపం చేయడం, తపస్సు చేయడం, స్నానం చేయడం, ప్రార్థనలు చేయడంపై ఎటువంటి ఆంక్షలు లేవు.
