SGSTV NEWS online
CrimeNational

అర్ధరాత్రి పోలీసుల రహస్య పూజలు.. స్టేషన్ లో మేక బలి!



చెన్నై : తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరు సమీపంలో ఉన్న తీవట్టిపట్టి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఒక వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను తగ్గించడం కోసమంటూ.. పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత రహస్యంగా మేకను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం వెలుగులోకి వచ్చింది.

తివట్టిపట్టి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో, సబ్-ఇన్స్పెక్టర్లు, కొందరు సిబ్బంది కలిసి ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు పోలీసు స్టేషన్లో రహస్యంగా పూజలు నిర్వహించారు. ఒక మేకను బలి ఇచ్చి, దాని రక్తాన్ని పోలీస్ స్టేషన్ ముఖద్వారం వద్ద చల్లారు.

రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఇలా జంతు బలి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో, ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల కాలంగా పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరుగుతుండటం, తమకు విశ్రాంతి, సెలవులు కూడా లేకుండా ఉక్కిరి బిక్కిరి అయ్యేపరిస్థితి ఉండటంతోనే ఈ పూజలలో లీనమైనట్టుగా అక్కడి సిబ్బంది వాపోవడం గమనార్హం.

Also read

Related posts