పూడూరు: నడుస్తున్న బస్సులో అత్యవసర ద్వారం తెరచుకోవడంతో ఓ బాలిక రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్దేముల్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం కర్ణాటకలోని గుర్మిట్కల్ నుంచి హైదరాబాద్కు వెళ్తాంది. పూడూరు మండలం రాకంచర్ల దాటగానే మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అత్యవసర ద్వారం తెరచుకుంది. దాని పక్కనే కూర్చున్న ఐదేళ్ల బాలిక రోడ్డుపై పడిపోయింది.
మరో బాలుడు పడిపోతుండగా పక్క సీట్లో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై పట్టుకున్నారు. బాలికకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళ తన కూతురు, కుమారుడితో కలిసి కొడంగల్ నుంచి వస్తున్నట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. పిల్లలు ఆడుకుంటూ.. అత్యవసర ద్వారం తెరవడంతోనే బాలిక పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బాలికకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు యత్నించినా.. అందుబాటులోకి రాలేదని పోలీసులు వెల్లడించారు. వైద్యం కోసం వెళ్లిన వారు వికారాబాద్ ఆస్పత్రిలో కన్పించకపోవడం గమనార్హం.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





