నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సంచలనం సృష్టించిన రూ.41 లక్షల చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. బాధితుడి సొంత మేనల్లుడే తన బాబాయ్ ఇంట్లో చోరీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. వేములవాడ దర్శనానికి వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు బంగారం, వెండి, నగదును అపహరించారు. అనంతరం అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న
ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సొంత బాబాయ్ ఇంట్లో సుపారీతో దోపిడీ చేయించిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మార్వాడి వ్యాపారీ కుటుంబ సమేతంగా వేములవాడ మల్లన్న దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి పకడ్బంధీగా దేవుడి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే.. వారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.41 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఆర్మూర్ పట్టణంలోని బ్రాహ్మణపల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా బ్యాగ్ తో సంచరిస్తుండగా.. పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకోవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది.
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన విజయ్ అగర్వాల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతనికి నేర చరిత్ర ఉంది. దాదాపు ఏడు కేసులు నమోదు అయ్యాయి. విజయ్ అగర్వాల్ తన బాబాయ్ ఇంట్లో చోరీకి పథకం రచించాడు. విజయ్ అగర్వాల్ తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన సల్మాన్ ఖాన్ అలియాస్ కలీం లల్లాతో పాటు అదే ప్రాంతంలో వేంకటేశ్వ కాలనీకి చెందిన ముంజల్ సాయి కుమార్, శ్రీ హరి అనే వ్యక్తి ద్వారా తన బాబాయ్ ఇంటిలో చోరికి ప్లాన్ వేశారు. అందుకు గాను ముగ్గురికి కొన్ని డబ్బులు ఇచ్చి చోరీ చేయాలని దోచుకున్న సొమ్ము పంచుకోవాలని పథకం రచించాడు.
ఇందులో భాగంగా.. మే 24న తన బాబాయ్ ఇంటికి తాళం వేసి వెళ్లగా ముగ్గురి ద్వారా రూ.41 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేశారు. అందులో శ్రీహరి 8 లక్షలు నగదు తీసుకుని పరారీలో ఉండగా మిగిలిన 31 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు 19 లక్షల నగదును సీజ్ చేసి విజయ్ అగర్వాల్, సల్మాన్ ఖాన్, ముంజల్ సాయి కుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు.. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also read
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లి బావబావమరిది మృతి
- ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
- జీడిమామిడి తోటలో ఏం జరిగింది..? శవాలుగా తల్లీకూతురు.. ఉలిక్కిపడ్డ ఏలూరు..
- పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి….. గ్రీష్మ కుమార్,సి.పి.ఐ.యం.యల్. (న్యూ డెమోక్రసీ)
- శివుని అష్టమూర్తి తత్వం అంటే ఏంటి? పరమేశ్వరుడు ఎక్కడెక్కడ వెలిశాడు?





