బంగారం దొంగతనం చేసిందని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళను విచారణకు పిలిచి పలు ప్రశ్నలు అడిగారు.ఆ అవమానాన్ని తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. కానీ చనిపోయే ముందు ఆమె వదిలిన సెల్ఫీ వీడియో ఇప్పుడు తెనాలిలో సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాద ఘటన వెలుగుచూసింది. బంగారం దొంగతనం కేసులో పోలీసుల విచారణతో మనస్థాపం చెందిన తిరుపతమ్మ అనే వివాహిత సెల్ఫీ వీడియో తీసుకొని గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. తెనాలి నాజర్పేటలోని ఒక అపార్ట్మెంట్లో తిరుపతమ్మ, సాయిబాబా దంపతులు వాచ్మన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతమ్మ అదే అపార్ట్మెంట్లోని కొన్ని ప్లాట్లలో పనులకు కూడా వెళ్లేది. ఈ క్రమంలోనే ప్లాట్ యజమాని స్వర్ణలతతో తిరుపతమ్మకు పరిచయం ఏర్పడింది. నమ్మకం కుదరడంతో ఇద్దరి మధ్య డబ్బుల లావాదేవీలు నడిచేవి. ఈ క్రమంలోనే స్వర్ణలత కొంత బంగారాన్ని తిరుపతమ్మకు ఇచ్చి, దానిని తాకట్టు పెట్టుకుని డబ్బులు వాడుకోమని చెప్పింది. ఆమె చెప్పినట్లే రెండు మూడు సార్లు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న తిరుపతమ్మ, తిరిగి ఇవ్వాల్సిన మొత్తంలో కొంత బాకీ పడింది. ఈ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. దీంతో స్వర్ణలత, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి కలిసి.. తిరుపతమ్మ దంపతులు తమ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగతనం చేశారంటూ తెనాలి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బంగారం ఎక్కడ దాచావ్..?
స్వర్ణలత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో వన్టౌన్ ఎస్సై అబ్రహం రంగంలోకి దిగారు. వరుసగా రెండు మూడు రోజుల పాటు తిరుపతమ్మ దంపతులను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. “బంగారం ఎక్కడ దాచారు? ఎక్కడ తాకట్టు పెట్టారో చెప్పండి” అంటూ ఒత్తిడి తెచ్చారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ పోలీసులు బెదిరించడంతో ఆ దంపతులు తీవ్ర అవమాన భారంతో కుంగిపోయారు.
భర్త బయటకు వెళ్లగానే.. గడ్డిమందు తాగిన తిరుపతమ్మ
మొన్న పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సోమవారం నాడు భర్త సాయిబాబా పని మీద బయటకు వెళ్లిన సమయంలో తిరుపతమ్మ ఇంట్లోనే గడ్డిమందు తాగింది. అంతకంటే ముందు తన సెల్ఫోన్ లో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. “మేము దొంగతనం చేయలేదు.. కానీ తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారు. స్వర్ణలత చేసిన తప్పులను, ఆమెకున్న వివాహేతర సంబంధాలను నేను ఎక్కడ బయటపెడతానో అన్న భయంతోనే మాపై ఈ తప్పుడు దొంగతనం కేసు పెట్టించింది. పోలీసులు వేధింపులు తాళలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కలెక్టర్ గారే మాకు న్యాయం చేయాలి” అంటూ కన్నీరు మున్నీరైంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కొంతసమయానికి భర్త సాయిబాబా ఇంటికి వచ్చి చూసేసరికి తిరుపతమ్మ అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన ఆయన వెంటనే ఆమెను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి గుంటూరు సర్వజనా కనెక్టెడ్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తిరుపతమ్మ కన్నుమూసింది.
పోలీసుల వివరణ.. ప్రజా సంఘాల ఆగ్రహం
మరోవైపు ఈ ఘటనపై వన్టౌన్ పోలీసులు స్పందిస్తూ.. తాము ఎవరినీ వేధించలేదని, కేవలం విచారణ మాత్రమే చేశామని చెప్పారు. భయంతోనో లేదా మరే ఇతర ఒత్తిళ్ల వల్లో తిరుపతమ్మ భర్త సాయిబాబా ఈ మరణంపై మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే మృతురాలి సెల్ఫీ వీడియో ఆధారంగా ఎస్సై అబ్రహంపై, తప్పుడు కేసు పెట్టిన స్వర్ణలత దంపతులపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, దళిత నేతలు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.
Also read
- 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా..? ఈ ఆలయాలకు వెళ్లి వస్తే నెలలోనే శుభవార్త!
- తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్మెన్ ఊహించని నిర్ణయం.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో..
- అర్ధరాత్రి రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో చోరీ
- మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు.. పవన్ ఘాటు కామెంట్స్





