హైదరాబాద్, మే 15: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మియాపూర్లోని గోకుల్ ప్లాట్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ హైదరాబాద్లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. అయితే జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు గదిని పరిశీలించగా కొన్ని రక్తపు మరకలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, గదిలో రక్తపు ఆనవాళ్లు ఉండటం చూస్తుంటే ఈ ఘటన వెనుక ఏదో కుట్ర ఉండొచ్చని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సాయంతో గదిలోని ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జనార్దన్ మృతి ఆత్మహత్యా? లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితుల ఫలితమా? అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also read
- అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!
- ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్
- దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!
- అద్దె గదిలో CA విద్యార్థి అనుమానాస్పద మృతి.. సూసైడా? మర్డరా..?
- తాండూరులో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పోక్సో కేసు నమోదు!





