వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని బాసలు చేశారు. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కానీ, ఆ బంధం నెల రోజులు కూడా నిలవలేదు.. చిన్నపాటి అనుమానం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. భార్య ఆత్మహత్య చేసుకుందన్న బాధతో, భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది.
భార్య ఆత్మహత్య చేసుకుందన్న మనస్తాపంలో భర్త కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన గటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కొండపాకకు చెందిన లహరి, కొమురవెల్లికి చెందిన వినయ్ గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు, గత నెల 9న ఘనంగా వివాహం జరిపించారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట, ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలోనే వారి మధ్య కలహాలు మొదలయ్యాయి.
లహరి ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందన్న అనుమానం వినయ్లో మొదలైంది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 7న భార్యను కొండపాకలోని ఆమె పుట్టింటి వద్ద దించి వెళ్లాడు వినయ్. భర్త తనను అనుమానిస్తున్నాడన్న బాధతో కలత చెందిన లహరి.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. లహరి ఆత్మహత్య విషయం తెలిసిన వినయ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. హైదరాబాద్ నుంచి బైక్ పై హుటాహుటిన బయలుదేరాడు. కానీ, భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన అతడు మార్గ మధ్యలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కుకునూరుపల్లి మండలం రాయవరం శివారులో వద్దకు రాగానే ఆగి.. ఆ పక్కనే ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన లొకేషన్ను కుటుంబ సభ్యులకు షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా నెల రోజుల క్రితం పెళ్లి వేడుకతో సందడిగా ఉన్న ఆ రెండు కుటుంబాల్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. అనుమానం పెనుభూతమై అన్యోన్య దంపతులను పొట్టన పెట్టుకుంది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Odisha: జెండా వేడుకలో పెను విషాదం.. టీచర్ మృతి, ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు.. ఏంజరిగిందంటే..?.
- పుష్య నక్షత్రంలో గురు మార్పులు.. ఆగస్టు 19 వరకు ఈ రాశుల జాతకం అమాంతం మారబోతోంది
- పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది!
- ఆలయంలో దారుణం.. మైనర్పై అర్చకుడి లైంగిక వేధింపులు
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?





