SGSTV NEWS online
Andhra PradeshCrime

11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు





కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మండలంలోని వీరన్నగట్టుపల్లి గ్రామ సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దహనమైంది. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుండి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెళ్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు బస్సు టాప్కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుపై మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును ఆపివేశారు. దీంతో ప్రయాణికులందరూ హుటాహుటిన బస్సు నుండి కిందకు దిగిపోయారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రాణనష్టం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు క్రమక్రమంగా బస్సు మొత్తం వ్యాపించడంతో ఆర్టీసీ బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దహనమైంది. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also read

Related posts