జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ తో సహా తెగిపడి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో కూలి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బాలుడి ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వ్యవసాయ బావి కోసం పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రెయిన్తో సహా తెగిపడి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొరికిశాల గ్రామ శివారులో దేవరావు అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో పూడిక తొలగించే పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదవశాత్తు తెగి బావిలోకి జారిపడింది. ఈ క్రమంలోనే ముగ్గురు కూలీలు కూడా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృత చెందిన వారిలో కొరికిశాల గ్రామానికి చెందిన సుకిన దేవారావు, బండారి అభిలాష్ అనే బాలుడితో పాటు, పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడి అనే కూలి ఉన్నాడు. అభిలాష్ అనే బాలుడు ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. మొదటిరోజు పరీక్ష రాసివచ్చిన అనంతరం పూడిక తీత పనులు చూసేందుకు వెళ్లి బావిపైన కూర్చున్నాడు. క్రేన్ తెగిపడుతున్న క్రమంలో పట్టుకునే ప్రయత్నంచేసి తను కూడా అదే బావిలో తెగిపడి ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మరో కూలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకునేలా చేసింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్కు తీసుకెళ్లి..





